'రయ్...!!!'మంటూ పల్లెటూరి రోడ్డుపై దుమ్ములేపుతూ దూసుకుపోతోంది ఆటో. 'ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటా... ఐదు నిమిషాల్లో వస్తా' అని రాసుంది ఆ ఆటో మీద. డ్రైవర్కి రెండు పక్కలా ఇద్దరేసి చొప్పున వేలాడుతున్నారు. వెనక సీట్లో కూడా అంతే. ఎవరో కట్టకట్టి లోపల పడేసినట్టు ఓ పదిమందికి పైనే ఇరుక్కుని కూర్చున్నారు. ఆటో వెనక డోర్ తీసేసి, అక్కడ మరో నలుగురు కూర్చున్నారు. ఆటో టాప్ మీద లగేజ్ తాళ్లతో కట్టి ఉంది. 'ఎంతమంది ఎక్కినా నా ఆటోలో ఇంకొకరికి ఖాళీ ఉంటుంద'న్నట్టు దారి పొడవునా జనం కనిపించిన చోటల్లా ఆపుతున్నాడు ఆటో డ్రైవర్. ఆటో ఇంజన్ సౌండ్ వినిపించట్లేదు కాని ఆటోలో ఉన్న సీడీ ప్లేయర్ చేసే సౌండ్ మాత్రం జస్ట్ ఓ మైలు దూరం దాకా వినిపిస్తుంది.... ఇప్పుడు ఏ ఊళ్లో చూసినా ఇదే సీన్. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఆటో ఎప్పుడైతే పల్లెటూర్లో ఎంటరైందో అప్పుడే దాని రూపు, సైజు, ప్రయోజనం అన్నీ మార్చుకుంది. కొత్త హంగులు సమకూర్చుకుని అన్ని ప్రయాణ అవసరాలు తీర్చే మల్టీ పర్పస్ వాహనమైంది. పల్లెప్రజల ప్రియమైన ప్రయాణ సాధనమైన ఆటో గురించే ఈ వారం కవర్స్టోరీ.ముందుగా ఓ పొడుపు కథపల్లెటూళ్లని పట్టణాలని కలిపేది, పొద్దుపొడవక ముందు నుంచి పొద్దుపోయేదాకా తిరుగుతూనే ఉండేది, పిల్లల్ని బడికి, కూలీల్ని పనికి తీసుకెళ్లేది, పొలంలో కూరగాయల్ని మార్కెట్కి చేర్చేది, మార్కెట్నుంచి ఎరువుల్ని పొలానికి చేర్చేది, అన్నిటికన్నా ముఖ్యంగా ఆపదలో అంబులెన్స్ కన్నా ముందుగా వచ్చేది ఒకటుంది... ఏమిటది?
ఆటో ! అవును, ఆ మూడు చక్రాల ఆటోరిక్షా లేకపోతే పల్లెటూరి జనానికి ఏ పనీ జరగట్లేదిప్పుడు. పనికి, బడికి చేర్చడం లాంటి రోజువారీ అవసరాలకే కాదు పెళ్లికైనా, పెళ్లిచూపులకైనా, పుట్టినరోజైనా, బారసాలకైనా...ఏ శుభకార్యానికి వెళ్లాలన్నా నలుగురు కలిస్తే చాలు వారికి అందుబాటులో ఉండేది, పిలవగానే వచ్చి వాలేది ఆటోయే. ఊళ్లో ఆటో ఉంటే అందరికీ సొంతకార్లున్నట్టే అంటున్నారు పల్లెజనం. అది వారి సొంతం కాకపోయినా సొంతం అన్నంతగా అందుబాటులో ఉంటుంది. అందుకే ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోనే ఆశ్రయిస్తున్నారు.
ప్రజల్ని గమ్యం చేర్చడమే కాదు, లగేజీ చేరవేసే వ్యాను, టెంపో, చిన్నసైజు లారీ కూడా అదే. వెనకున్న సీటు పీకేస్తే చాలు ఎంత లగేజీ అయినా మోసుకెళ్తుంది. రైతులు పండించిన కూరగాయల్ని మార్కెట్కి చేర్చేదీ, కిరాణాషాపుల యజమానులు టౌన్ నుండి సరుకులు పల్లెలకి తీసుకొచ్చేదీ ఆటోలోనే. అందుకే ఇప్పుడు అదే స్కూల్ వ్యాను, అదే పాల వ్యాను, అదే బస్సు, అదే లారీ, అదే కొరియర్, అదే అంబులెన్స్... ఇంకా చెప్పాలంటే పల్లెటూరి బతుకుబండి అయిపోయింది.
ఇలా ఎంటరైంది...
ఒకప్పుడు...అంటే పదీ పదిహేనేళ్ల క్రితం దాకా ఆటోలు టౌన్లలో మాత్రమే కనిపించేవి. పట్టణాలు, నగరాల్లో ఇరుకు గొందుల్లో, సందుల్లో కూడా చొచ్చుకుపోతూ ఉండేవి. వాటిని నడిపేవాళ్లలో ఎక్కువశాతం పట్టణవాసులే అయినా కొందరు చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కూడా ఉండేవారు. వాళ్లంతా ఉదయాన్నే పట్టణానికి వెళ్లి బాడుగకు ఆటో తిప్పుకుని మళ్లీ రాత్రికి పల్లెకి చేరేవాళ్లు. తర్వాత మెల్లమెల్లగా చుట్టుపక్కల గ్రామాలకూ ఆటో చేరువైంది. ఇప్పుడు ఏ ఊర్లో చూసినా ఆటోలే.
పల్లెటూరికి పట్టణానికి ప్రజల రాకపోకలు రానురాను పెరుగుతున్నాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా బస్సు సౌకర్యాలు ఏ మాత్రం పెరగలేదనే చెప్పాలి. సరిగ్గా అదే సమయంలో ఎంటరైంది ఆటో. బస్సులకోసం గంటలసేపు పడిగాపులు కాసే జనానికి ఆటో రావడంతో ఆ అవసరం లేకుండా పోయింది. క్రమంగా అన్ని అవసరాలకీ అదే ఆధారమైంది. ఇంతగా ప్రజలకి చేరువవ్వడానికి అసలు కారణం మరొకటుంది.
ఆటోవాలా లోకల్
'చంటిగాడు లోకల్'...ఇప్పుడు ఆటోల మీద ఎక్కువగా కనిపించే డైలాగ్ ఇదే. ఆ డైలాగ్ లాగానే ఆటో అంటేనే లోకల్. ఇప్పుడు ఏ ఊర్లో చూసినా కనీసం ఐదారు ఆటోలుంటున్నాయి. వాటిని కొనుక్కుంటున్నది, నడుపుతున్నది కూడా పల్లెటూరి కుర్రవాళ్లే. "ఎంతకాదన్నా మనఊరి వాళ్లంటే మనకి అభిమానం ఉంటుంది కదా. పైగా అందరూ పరిచయస్తులే. అందుకే వాళ్లు ఏ చిన్న పని చెప్పినా చేస్తాం. గుంటూరు మార్కెట్కి కూరగాయలు తీసుకెళ్లడానికి రైతులు రానవసరం లేదు. మేమే తీసుకెళ్లి కొట్లో దించేస్తాం. ఒక్కోసారి ఖాళీ గంపలు, అమ్మితే వచ్చిన డబ్బులు మేమే తీసుకెళ్లి రైతులకిస్తాం. పాల వ్యాపారులు మా ఊర్లో పాల క్యాన్లు ఆటోలో వేస్తే చాలు మేమే వాటిని పొన్నూరులో హోటల్ దగ్గర దించేస్తాం. ఇంకా చిన్నా చితకా సాయాలు చాలా చేస్తుంటాం. టాబ్లెట్లు, పళ్లు తెమ్మని తెలిసినవాళ్లు అడిగితే తీసుకొచ్చి ఇస్తాం. ఒకళ్లేమో రీచార్జ్ కార్డు తెచ్చిమ్మని అడిగితే ఇంకొకళ్లు యూరియా బస్తాలు వేసుకురమ్మని అడుగుతారు. ఇవన్నీ బస్సోళ్లు చెయ్యలేరుగా'' అన్నాడు మామిళ్లపల్లి నుండి పొన్నూరుకి, గుంటూరుకి ఆటో నడిపే మస్తాన్. ఆయన గత మూడేళ్లుగా ఆటో నడుపుతున్నాడు.
"దారి పొడుగునా అన్ని ఊళ్ల వాళ్లకి ఈ రూట్లో తిరిగే ఆటోల గురించి తెలుసు. ఒక్కొక్కరైతే ఇంట్లో బయల్దేరుతూ ఉండగానే ఇదిగో వస్తున్నా... ఒక్కనిమిషం ఆపు అని అడుగుతారు. అది కాస్తా పావుగంట అవుతుంది. అయినా తప్పదు మాకు. తెలిసినోళ్లు కదా, మొహమాటం కొద్దీ ఆపాలి. ఆపకుండా వెళ్తే వాళ్లు రెండోసారి ఎక్కొద్దూ? పేషెంట్లని ఆస్పత్రి దాకా తీసుకెళ్లి దించాల్సిందే. అవసరమైతే సాయం పట్టి లోపలికి తీసికెళ్లాల్సిందే. బడిపిల్లలకి నచ్చిన పాటలు పెట్టాల్సిందే. డైలీ వచ్చేవాళ్లు కాబట్టి బడిపిల్లలకి ఒక రూపాయి తక్కువే తీసుకుంటాం'' అని చెప్పాడాయన. లోకల్ వాళ్లకి ఈ చిన్నచిన్న ఔదార్యాలు తప్పవుమరి.
ఓనర్లే డ్రైవర్లయితే...
పట్టణాల్లో అయితే ఆటోలను రోజువారీ అద్దెకు ఇచ్చే యజమానులుంటారు. డ్రైవర్లు వాళ్లవద్ద నుండి ఆటోలు తెచ్చుకుని నడుపుకుంటారు. సొంతగా ఆటో నడుపుకునే వారి శాతం చాలా తక్కువ. పల్లెల్లో అలా కాదు. ఆటో నడిపేవాళ్లలో ఇంచుమించు అందరూ యజమానులే. స్కూల్లోనే చదువుకి ఫుల్స్టాప్ పెట్టిన వాళ్లు, కాలేజీ డ్రాపవుట్లు, కూలి పని ఎక్కడ చేస్తాంలే అనుకునే వాళ్లు... ఇలా రకరకాల వాళ్లు ఎంతోకొంత డబ్బు పోగు చేసుకుని ఆటో కొనుక్కోవాలనుకుంటే చాలు ఫైనాన్స్ సంస్థల సాయంతో ఆటో చేతికొచ్చేస్తుంది. ఈ మధ్య పెళ్లికొడుకులకి కట్నంగా ఆటోలు కొనివ్వడం కూడా పల్లెల్లో ఎక్కువైపోయింది. ఆటో ఉన్నవాళ్లకి పెళ్లిళ్లు కూడా త్వరగా కుదురుతున్నాయట.
సొంతంగా నడుపుకునే వారికుండే లాభాలే వేరని అంటున్నారు ఆటోవాలాలు. ఎలాగంటే...పొద్దుపొద్దునే ఆటో బయటికి తీస్తే మళ్లీ ఇల్లు చేరేది రాత్రికే. ఎంతసేపు నడుపుకుంటే అంత ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఎప్పుడు కావలిస్తే అప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు. ఎంత లోడ్ అయినా వేసుకోవచ్చు, బాడుగకి ఎంత దూరమైనా వెళ్లొచ్చు. చిన్నచిన్న రిపేర్లన్నీ వాళ్లే చేసుకోవచ్చు.
"మా ఊరికి ఆటో తిప్పడమంటే పెద్ద తంటా. ఎందుకంటే మా నాన్న నేను ఎన్ని ట్రిప్లు వేస్తున్నానో కూడా లెక్క పెడతాడు. ఆటో తీసుకుంది మా నాన్న పేరు మీదే. సాయంత్రానికి తక్కువ డబ్బులిస్తే కుదరదు. నెల చివర ఫైనాన్స్ వాళ్లకి కట్టడానికి డబ్బులు తక్కువైతే ఇచ్చేది మా నాన్నే కాబట్టి రోజూ డబ్బులు ఆయన చేతిలోనే పెట్టాలి'' అన్నాడు ఓ కొడుకు. ఇలాంటి ఇబ్బందులు కొన్ని ఉన్నా మొత్తం మీద ఆటోకి అతనే యజమాని. సర్వస్వతంత్రుడు.
అందచందాలూ ఎక్కువే...
దేవుళ్ల ఫోటోలతో, చూడచక్కని రంగురంగుల డెకరేషన్లతో ప్రతి ఆటో అప్పుడే అలికి ముగ్గు పెట్టిన పల్లెటూరి ఇల్లంత సుందరంగా ఉంటుంది. అంతేకాదు సినిమా హీరో హీరోయిన్ల పోస్టర్లు, సినిమా డైలాగులు, ప్రేమ సూక్తులు, స్నేహగీతాలు...వెరసి ఆటోలన్నీ వాటి యజమానుల అభిరుచులను వ్యక్తపరచే వేదికలవుతాయి. వింతవింత ధ్వనులు చేసే కొత్తకొత్త హారన్లు, తళతళా మెరిసే స్టికర్లు, రకరకాల డిజైన్లు ఆటోలకే సొంతం.
'సింహంతో వేట, నాతో ఆట వద్దు' అని ఓ ఆటో చాలెంజ్ చేస్తే 'ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటా... ఐదు నిమిషాల్లో వస్తా' అని మరో ఆటో భరోసా ఇస్తుంది. 'సూర్యుడికి చెమట పట్టదు చంద్రుడికి చలి పుట్టదు నాకు భయం వేయదు', 'నన్ను వేటాడాలంటే ఎడం వైపు పుట్టాల్సిన గుండె కుడివైపున పుట్టాలి', 'నీటితో పెట్టుకుంటే మునిగిపోతావ్, నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావ్ నాతో పెట్టుకుంటే చచ్చిపోతావ్'లాంటి డైలాగులకి కొదవ లేదు. వీటిని ఆటో సూక్తులంటారో, కవితలంటారో మీ ఇష్టం.
ప్రేమ కావ్యాల గురించైతే చెప్పనక్కర్లేదు. 'నీకోసమే నా అన్వేషణ, నీ కోసమే నా నిరీక్షణ, నీతో గడిపే క్షణం కోసం కొన్ని వేల సార్లు మరణించైనా ఒక్కసారి జన్మిస్తా' అని ఒకరు రాసుకుంటే, 'ప్రేమించే మనసు లేనపుడు ఆకర్షించే అందమెందుకు?' అని మరొకరు ప్రశ్నను సంధిస్తారు. 'క్షణంలో పుట్టేది ప్రేమ, అనుక్షణం వేధించేది ప్రేమ', 'కాలంతో పనిలేనిది, ధనంతో కొనలేనిది ప్రేమ ఒక్కటే', 'చూసే ప్రతిపువ్వు వికసించదు... నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు'...ఇలాంటి కొటేషన్లు ఆటోల మీద కోకొల్లలు. 'అమ్మ దీవెన', 'గాడ్స్ గిఫ్ట్' లాంటివి కూడా ప్రతి ఆటో మీదా కనిపించేవే. ఆటోవాళ్లు తమ వంతుగా ప్రయాణీకులకి సాయం చేస్తుంటారు. అందుకే 'గర్భిణీలకు, వృద్ధులకు ఉచితం' అని కూడా రాసుకుంటున్నారు. నిజానికి పోలీసులకు కూడా మా ఆటోల్లో ప్రయాణం ఉచితమే. 'పోలీసులకు ఉచితం' అని నా ఆటోమీద రాసుకోవాలనుంది కానీ వాళ్లకి భయపడే ఆ పని చేయలేదు అన్నాడు ఓ ఆటోవాలా.
ఆటోలు అందుబాటులో లేని రోజుల్లో చిన్నచిన్న పనులకి కూడా ట్రాక్టర్ని పిలవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏడెనిమిది క్వింటాళ్ల బరువులైనా ఆటోల మీద వేసుకొచ్చేస్తున్నారు. మరీ ఎక్కువ సరుకు ఉంటేనే ట్రాక్టర్ అవసరం అవుతుంది. దుక్కి దున్నడానికి తప్ప మిగతా పనులన్నిటికి ఇప్పుడు ఆటోలే వాడుతున్నారు. ఒక ట్రాక్టర్ అవసరమైన చోట ఇప్పుడు నాలుగు ఆటోలు వచ్చి చేరుతుండడంతో ఎక్కువ మందికి ఉపాధి కూడా లభిస్తోంది. ఇదివరకు వరినాట్లు, కోతలు, మిగతా పనుల సీజన్లో కూలీల కోసం చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు ట్రాక్టర్లు పంపించే వారు. ఇప్పుడేమో 'మీరే ఆటోలు వేసుకురండి మేం చార్జీలిస్తాం' అంటున్నారు. ఆటో లేకపోతే దూరం పొలాలకు కూలి పనికోసం ఎవరూ రావట్లేదు కూడా.
నడవడం తగ్గింది...
ఇదివరకు పక్క ఊరుకు వెళ్లాలన్నా, పిల్లలు వేరే ఊళ్లో ఉన్న హైస్కూలుకి వెళ్లాలన్నా నడిచో సైకిలెక్కో వెళ్లే వారు. మెయిన్ రోడ్ మీద బస్సు దిగి ఊరు ఒకటి రెండు కిలోమీటర్లున్నా నడిచే వెళ్లేవారు. ఆటోలు రంగప్రవేశం చేయడంతో ఆ కాస్తంత దూరం కూడా జనానికి ఇప్పుడు అనంత దూరంలా కనిపిస్తున్నది. అందుకే నడిచి వెళ్లడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. "బడికి ఎక్కడ నడిచి వెళ్తారులే అని సైకిల్ కొనిస్తే ఆటోలో వెళ్లే తోటి వాళ్లని చూసి సైకిళ్లొదిలేసి ఆటోలెక్కుతున్నారు. అమ్మాయిలే కాదు, అబ్బాయిలూ అంతే. అదేమంటే ఈ పుస్తకాలన్నీ మోసుకుంటూ రోజూ మేం నడవలేం. చూడు ఎంత బరువుందో అని పుస్తకాల బ్యాగ్లు చూపిస్తున్నారు. బడిపిల్లలే కాదు, ఊరికి దూరంగా ఉన్న పొలానికి వెళ్లాలన్నా ఆటో ఎక్కేస్తున్నారు పెద్దవాళ్లు. ముసలోళ్లకి ఇదంతా చూడ్డానికి విడ్డూరంగా ఉన్నా మాకు అలవాటైపోయింది'' అన్నాడు ఓ తండ్రి.
ఆలస్యమైనా...సెకండ్షోకైనా...టౌన్లో పని పూర్తికావడం కాస్త ఆలస్యం అయితే ఆటో ఆయనకి ఫోన్ చేసి కాసేపు ఆగమంటే చాలు. ఆయన ఆగక పోయినా తర్వాత వచ్చే ఆటో ఆయనకి ఫలానా వాళ్లు వస్తున్నారు, లేట్ అవుతుందట, కాసేపాగి ఎక్కించుకురా అని చెపుతారు. పిల్లలు పట్టణాల నుంచి ఇంటికొచ్చేటప్పుడు ఏ నడిరాత్రో ట్రైన్ దిగుతారు. అర్ధరాత్రయినా అపరాత్రయినా ఆటో వాళ్లకి ముందు చెప్పి ఉంచితే చాలు ఆ సమయానికి లేచి వచ్చేస్తారు. పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేస్తారు. తెల్లవారుజామున రైల్వే స్టేషన్కి వెళ్లాలన్నా అంతే. మారు మాట్లాడకుండా వస్తారు. ఇంత చేసినా డబ్బులు మరీ ఎక్కువేమీ తీసుకోరు. "మన ఊరివాళ్లే కదా, ఎక్కువ అడిగితే రేపు 'ఆయన అంత అడిగాడు' అని అందరికీ చెబుతారు. అందుకే మీరే ఎంతోకొంత ఇద్దురు కానీ ముందు వెళ్దాం పదండి అంటాం. అలాంటప్పుడు వాళ్లే కాస్త ఎక్కువ ఇస్తారు. కొంతమంది పిసినారులు ఎలాగూ ఉంటారు. వాళ్ల గురించి ఊరందరికీ తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ల దగ్గర మాత్రం డబ్బులు గట్టిగానే వసూలు చేస్తాం'' అన్నాడు శాంసన్ అనే ఆటోవాలా.
యూత్ సెకండ్షో సినిమా చూడాలంటే వారిలో ఎవరికో ఒకరికి ఆటో ఉంటే చాలు. "పొద్దున్నే బాడుగకి వెళ్లాల్రా అని చెప్పినా వినకుండా మేం వచ్చి నిన్ను నిద్ర లేపుతాంలే, ముందు నువ్వు సినిమాకి ఆటో పెట్టు అంటారు. అందరూ ఫ్రెండ్సే కాబట్టి సినిమా ట్రిప్ వేయక తప్పదు. పైగా పగలు సినిమాలు చూస్తే మాకూ లాసే. బాడుగ తోలుకోవాలి కదా. అందుకే నేను కూడా ఫస్ట్ షోకి కానీ సెకండ్షోకి కానీ వెళ్తా. అన్నగారి సినిమా రిలీజ్ రోజున మాత్రం మార్నింగ్ షో సినిమా చూసిన తర్వాతే ఆటో నడిపేది. బండి మనదే కాబట్టి మన ఇష్టం వచ్చినప్పుడు తోలుకోవచ్చు'' అంటూ వివరించాడు ఓ సినిమాల వీరాభిమాని.
ఫైనాన్సుల కష్టాలు...
ఊళ్లలో తిరిగేవన్నీ ఫైనాన్సు వ్యాపారుల సాయంతో కొనుక్కున్న ఆటోలే. ఒక ఆటో వెల లక్షా ఎనభై వేల రూపాయలు. అంత డబ్బు ఒకేసారి కట్టడం సాధ్యం కాదు కాబట్టి ఫైనాన్సు వ్యాపారులను ఆశ్రయిస్తారు వాళ్లు. వాళ్లేమో వడ్డీతో కలుపుకుని కట్టాల్సిన మొత్తాన్ని 2 లక్షల 15 వేలుగా నిర్ణయిస్తారు. ముందుగా ఇరవై వేలో ముప్పైవేలో కడితే బండి ఇచ్చేస్తారు. అప్పటినుండి రెండుమూడేళ్లపాటు నెలసరి వాయిదాల్లో మిగతా మొత్తాన్ని చెల్లించాలి. ఒక్కో ఫైనాన్సు వ్యాపారీ కొన్ని వందల ఆటోలకు రుణాలు ఇస్తాడు. ఈ విధంగా ఆటోలకు ఫైనాన్స్ చేయడం కోట్ల రూపాయల వ్యాపారమైంది.
నెలసరి వాయిదాలు చెల్లించలేకపోతే మాత్రం ఆటో తీసుకెళ్లిపోతారు ఫైనాన్సు వాళ్లు. కొందరు వ్యాపారులు నాలుగు నెలల దాకా సమయం ఇస్తారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు సామాన్య జనాన్ని వేధించినట్టు మాకూ వేధింపులు తప్పట్లేదని అంటున్నారు ఆటోవాళ్లు. కొందరు అప్పోసొప్పో చేసి ఆటోలు విడిపించుకుంటున్నా ఫైనాన్స్ సంస్థల దెబ్బకి ఆటోలు వదిలిపెట్టుకుంటున్న వాళ్లు కూడా ఉన్నారు. "ష్యూరిటీ లేకుండా ఆటోలు ఎవరిస్తారు మరి? బ్యాంకులు లోన్లు ఇవ్వవు. ఫైనాన్సు వాళ్లకి అప్పులు ఇవ్వడం తెలుసు, డబ్బులు వసూలు చెయ్యడం తెలుసు, ఆటో తీసుకెళ్లి సెకండ్హ్యాండ్గా అమ్మడమూ తెలుసు. అందుకే వాళ్లు కేవలం రేషన్ కార్డు జిరాక్స్ కాపీ తీసుకుని ఆటో చేతిలో పెడతారు. ఆటో వాళ్లకి సీజన్ అన్సీజన్ అంటూ ఏమీ ఉండదు కాబట్టి రోజూ ఎంత ఎక్కువ కష్టపడితే అంత సంపాదించుకోవచ్చు, డబ్బులు కూడా కట్టొచ్చు'' అన్నాడు ఫైనాన్స్పై ఆటో తీసుకున్న వెంకట్రావు.
మృత్యుశకటాలైతే...ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి ఖాళీ ఉండే ఈ పుష్పక విమానాలే ఒక్కోసారి మృత్యుశకటాలవుతున్నాయి. ఎందరో ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. పల్లెటూరి రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు తక్కువే కాబట్టి అక్కడ ఎలా నడిపినా పెద్ద ప్రమాదముండదు. హైవే ఎక్కినాక కూడా గాల్లో తేలిపోతున్నట్టు అంతే వేగంగా నడిపితే ఫలితం అదుపుతప్పడం... ప్రాణా లు పోవడం జరుగుతుంది. యాక్సిడెంట్లకి కారకులు ఆటోవాళ్లే అనలేం కానీ ఫలితం అనుభవించేది మాత్రం ఆటోల్లో ప్రయాణించేవాళ్లే. బస్సులు, లారీలు, వ్యాన్లు లాంటి పెద్ద వాహనాల్ని ఢీకొంటే నుజ్జునుజ్జు అయ్యేవి ఆటోలే. "మూడు చక్రాల బళ్లు నడపడం అంత సులభం కాదు. హ్యాండిల్ ఎప్పుడూ ఓ పక్కకి లాగుతూ ఉంటుంది కాబట్టి వేగంగా వెళ్లేటప్పుడు కంట్రోల్ చెయ్యలేం. అందుకే యాక్సిడెంట్లు జరుగుతున్నాయ''ని ఒప్పుకోలుగా చెప్పాడు ఓ ఆటో డ్రైవర్. పరిమితికి మించి జనాన్ని ఎక్కించడం ఆటోవాళ్లకి అలవాటైపోతే అలాగే ఎక్కి వెళ్లడం గ్రామస్తులకు అలవాటైపోయింది.
బస్సులు... పోలీసులు...నిత్యం 'నష్టాల్లో కూరుకుపోతున్నా'నంటున్న ఆర్టిసికి ఆటో నష్టం కన్నా లాభాన్నే చేకూర్చింది. ఎలాగంటే తమ బస్సుల్ని గ్రామాలదాకా నడపాల్సిన పని తప్పిపోయింది దానికి. మారుమూల గ్రామాలకయితే బస్సు సర్వీసుల్ని ఇంచుమించు పూర్తిగా ఉపసంహరించుకునే పనిలో పడింది ఆర్టిసి. చాలా ప్రాంతాల్లో బస్సు డిపోలను కూడా ఎత్తేసింది. మామిళ్లపల్లిలో కూడా అంతే. ఒకప్పుడు ఆ ఊరు మీదుగా పొన్నూరు తెనాలి మధ్య పది బస్సులు తిరిగేవి. గుంటూరుకి రెండు బస్సులు తిరిగేవి. ఇవి కాక రెండు ప్రైవేటు బస్సులు కూడా ఉండేవి. రెండేళ్ల క్రితం పొన్నూరు డిపో తీసేశారు. ఇప్పుడు ఆ రూట్లో ఒకే ఒక్క బస్సు తిరుగుతుంది. జనమందరికీ ఆటోలే గతయ్యాయి. ఆ ఒక్క ఊరే కాదు ప్రతి గ్రామం కథ అంతే.
అయితే ఆటోవాళ్లకి బాడుగలు పెరిగేకొద్దీ పోలీసు వ్యాన్లు పల్లెటూర్లు రావడం కూడా పెరిగింది. ఆటోవాళ్లేమో టౌన్ దాటగానే ఎక్కువమంది జనాన్ని ఎక్కించుకుంటారు. దాన్ని అరికట్టడానికని ఫైన్లు వేసినా వాళ్లాపని చేయకుండా ఉండరు. అందుకే ఇప్పుడు పల్లెటూరి రోడ్లపై కాపు కాసే పోలీసు వ్యాన్ల సంఖ్య పెరిగింది.
***
ఎవరెన్ని ఫైన్లు వేసినా, జాగ్రత్తలు తీసుకోమని బుజ్జగించినా పల్లెటూరి జనం ప్రయాణించడానికి ఆటో తప్ప సులువైన వాహనం ఇంకోటేదీ లేదు. అందుకే రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా అతిపెద్ద ప్రైవేటు రవాణా వ్యవస్థగా ఆటో ఎదుగుతూ పోతోంది.