Monday, June 27, 2011

సోమాలియా దొంగల దేశం ఎందుకైంది?





సోమాలియా అని గూగుల్‌లో 'సెర్చ్' చేస్తే దాని పక్కనే 'పైరేట్స్' ప్రత్యక్షమవుతుంది. ఒకప్పుడు ఆకలిచావులకి మారుపేరైన సోమాలియా ఇప్పుడు పైరేట్స్‌కి.. అంటే సముద్రపు దొంగలకి మారుపేరవడానికి దారి తీసిన పరిస్థితులేమిటి? చదరపు కిలోమీటర్‌కి 14 మంది మాత్రమే జనసాంద్రత ఉన్న ఆ దేశం తలసరి ఆదాయంలో 148వ స్థానంలో ఉంది. అందుకే కాబోలు ఐరాస రూపొందించే మానవాభివృద్ధి సూచిలో కొన్నేళ్లుగా సోమాలియా పేరే లేకుండా పోయింది. వీటికి కారణం ఒకటని చెప్పలేం. అరాచకం, జాతుల వైరం, విదేశీ దోపిడీ.. ఇలా ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం, పాలన లాంటివి లేని సమాజంలో ఎంతటి అరాచకం రాజ్యమేలుతుందో చెప్పడానికి 1991, 2006ల మధ్య కాలం నాటి సోమాలియానే ఉదాహరణ అంటారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడినా దాని పనితనం అంతంత మాత్రమే. అదే అదునుగా ఎన్నో దేశాలు సోమాలియా వనరులను హరించి వేశాయి. చేపలు పట్టుకోవాల్సిన సోమాలియా జాలరులు సముద్రపు దొంగలుగా మారడం వాటన్నిటి పుణ్యమే.

నవంబర్ 2008. సౌదీ అరేబియా తీరం నుంచి అమెరికాకి బయల్దేరింది 'సైరస్ స్టార్'. చమురు రవాణా చేసే మహా నౌకలలో అది ఒకటి. 22 లక్షల బ్యారెళ్ల ముడి చమురుని తీసుకెళ్తున్న ఆ నౌకలో పాతికమంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. దాని ఖరీదు 50 మిలియన్ డాలర్లయితే దాన్లో ఉన్న చమురు ఖరీదు అక్షరాలా 100 మిలియన్ డాలర్లు. నౌకా సిబ్బందికి తెలుసు.. సోమాలియా తీరంలో సముద్రపు దొంగలు ఉంటారని, శరవేగంగా దూసుకుపోయే మర పడవల్లో వచ్చి ఎకె 47 లాంటి మారణాయుధాలతో దాడికి దిగుతారని తెలుసు. ఆ దొంగలు కొన్నేళ్లుగా పడవల్ని, ఓడల్ని హైజాక్ చేస్తున్నా తమలాంటి పెద్ద నౌకని ఎప్పుడూ హైజాక్ చెయ్యలేదు. అందుకే 'మనల్నేం చేస్తారులే' అని కాస్త ధీమాగానే ఉన్నారు వాళ్లు. ఆఫ్రికాకి ఈశాన్య మూలన ఉండే సోమాలియా తీరం దాటి కెన్యా పక్కనుంచి 'కేప్ ఆఫ్ గుడ్‌హోప్' దిశగా సాగిపోతున్నారు.

'హమ్మయ్య.. దాటేశాం. ఇక దొంగల భయం లేదు' అనుకుంటుండగా... కెన్యా తీరానికి 830 కిలో మీటర్ల దూరంలో చుట్టుముట్టారు సోమాలీ పైరేట్లు. కాసేపటికల్లా నౌకని తమ అధీనంలోకి తెచ్చుకుని సోమాలియా వైపు మళ్లించారు. తమ డిమాండ్లను 'అల్ జజీరా' చానల్ ద్వారా ప్రకటించారు... పదిరోజుల్లోగా 25 మిలియన్ డాలర్లు సైరస్ స్టార్‌కి చేరాలని, ఆ సొమ్మును తమ వద్ద ఉన్న మిషన్లతో లెక్కిస్తామని, వాటిలో గనక దొంగనోట్లుంటే తమ మిషన్లు పసిగడతాయని కూడా హెచ్చరించారు.55 రోజుల పాటు సౌదీ ఆయిల్ కంపెనీకి, పైరేట్లకి బేరసారాలు జరిగి చివరికి 3 మిలియన్ డాలర్లకి బేరం కుదిరింది. డబ్బు పారాచూట్ ద్వారా సైరస్ స్టార్‌ని చేరిన తర్వాత 9 జనవరి, 2009న ఆ నౌకను విడిచిపెట్టారు. డజన్లమంది పైరేట్లు ఆ డబ్బు తీసుకుని తమ మర పడవల్లో తీరం వైపు దూసుకుపోయారు. ఆ పడవల్లో ఒకటి సముద్రంలో వచ్చిన తుపాను తాకిడికి తిరగబడిపోతే అందులో ఉన్న ఐదుగురు నీటిలో మునిగిపోయారు. వారిలో ఒకరి శవం మరునాడు సోమాలియా తీరానికి కొట్టుకొచ్చింది. ఆ శవానికి ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్‌లో లక్ష డాలర్లున్నాయి. అదీ సోమాలియా పైరేట్ల కథ. దొంగతనం ఎంతటి సాహసంతో కూడుకుందో తెలియజేసే గాధ.

***

ఉద్యోగాల నుంచి రిటైరైన బ్రిటిష్ దంపతులు పాల్ చాండ్లర్, రేచల్ చాండ్లర్ తమ చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోవాలనుకున్నారు. 2006లో ఒక బోట్ కొనుక్కొని సముద్రంపై విహార యాత్రకి పయనమయ్యారు. నచ్చిన చోట నెలలపాటు గడిపేస్తూ.. ఇల్లు గుర్తుకొచ్చినప్పుడు బోట్‌ని ఏదో ఒక తీరంలో ఆపేసి బ్రిటన్ ఎగిరెళ్లిపోయే వారు... మళ్లీ కొన్ని రోజులకు యాత్రకి సిద్ధమయ్యేవారు. అలా ప్రపంచాన్ని చుట్టి రావాలని వారి కోరిక. దాన్ని నెరవేర్చుకునే క్రమంలోనే ఎర్రసముద్రం దాటి సోమాలియా మీదుగా టాంజానియా వెళ్తూ పైరేట్ల కళ్లలో పడ్డారు. 22 అక్టోబర్ 2009న వాళ్ల చేతుల్లో బందీలయ్యారు. అంతే.. సముద్రయాన విశేషాలు వివరిస్తూ ఆ దంపతులు రాస్తున్న బ్లాగ్‌లో అప్‌డేట్‌లు ఆగిపోయి.. 'ప్లీజ్ రింగ్ శారా' (శారాకి ఫోన్ చెయ్యండి) అని మాత్రమే రాసుంది. ఆ రోజు నుంచి వాళ్లు 388 రోజులపాటు పైరేట్ల చెరలోనే గడిపారు. ఆ దంపతుల బంధువుల నుంచి బ్రిటన్ ప్రభుత్వం దాకా ఎంతో మంది పైరేట్లతో సంప్రదింపులు, రాయబారాలు జరిపి చివరికి 3 లక్షల డాలర్లు చెల్లించిన తర్వాత 2010 నవంబర్ 14న వారిని విడిచి పెట్టారు.

***

అరేబియా సముద్రంలో దోపిడికి పాల్పడుతున్న 61 మంది సోమాలియన్లని గత నెల 13న భారత నౌకాదళం పట్టుకుని 13 మంది నావికులను కాపాడింది. అదేనెల 26న 16 మంది పైరేట్లని పట్టుకుని వారి చెరలో ఉన్న 16 మంది నావికులకు విముక్తి కలిగించింది. సోమాలియాలో ఆకలితో అలమటించేకంటేమన జైళ్లలో గడపడం నయమని మన నౌకాదళానికి చిక్కిన పైరేట్లు అంటున్నారు.
సముద్రంలో తెగబడే దోపిడి దొంగలని పైరేట్స్ అంటారు. ఆ దొంగలకిఇ ప్పుడు సోమాలియా తీరం కేంద్రమై రవాణాకి, సముద్రయానానికి పెనుసవాలుగా మారింది. సోమాలియా పైరేట్ల చేతికి చిక్కితే బయటపడడం ఎంత కష్టమో మొదటి రెండు సంఘటనలూ తెలియజేస్తుంటే కడు పేదరికమే వాళ్ల చేత ఆ పని చేయిస్తోందని మూడో సంఘటన తెలియజేస్తుంది.

ఆ గల్ఫే వారి స్వర్గధామం

ఆఫ్రికా ఖండానికి ఈశాన్య మూలన ఉంటుంది సోమాలియా. దానికి ఉత్తరాన ఉన్న సముద్రాన్ని 'గల్ఫ్ ఆఫ్ అడెన్' అని పిలుస్తారు. గల్ఫ్‌కి ఇటువైపు యెమెన్ దేశం ఉంటుంది. ఏటా ముప్పై వేలకి పైగా నౌకలు గల్ఫ్ ఆఫ్ అడెన్ గుండా ప్రయాణిస్తాయి. సోమాలియా ఆకలిచావుల దేశమైతే యెమెన్, దాని పక్కనున్న సౌదీ అరేబియా, ఒమన్ లాంటి దేశాలేమో ముడిచమురు అధికంగా ఉత్పత్తి చేసే దేశాలు. ఆ చమురు విదేశాలకి ఎగుమతి అయ్యేది గల్ఫ్ ఆఫ్ అడెన్ గుండానే. అదే పైరేట్ల పాలిట వరమైంది. ఆ నౌకలను హైజాక్ చేయడం.. వారి యజమానుల నుండి డబ్బు గుంజడం వారికి అలవాటైపోయింది. ఏటా వందల కొద్దీ నౌకల మీద దాడులు చేయడం, పదుల సంఖ్యలో ఓడలను హైజాక్ చేయడం, వందలమందిని బంధించి వారిని విడిచి పెట్టడానికి లక్షల డాలర్లు డిమాండ్ చేయడం వీరి ప్రధాన ఉపాధి మార్గమైపోయింది. సోమాలియా పైరేట్ల చెరలో ఇంకా కనీసం 600 మంది ఉండి ఉంటారు. వారిలో మన దేశీయులే 70 మందికి పైగా ఉన్నారు.

సూయజ్ ఉండీ లాభం లేదు

యూరప్, ఆసియా ఖండాల మధ్య దూరాన్ని సూయజ్‌కాల్వ దగ్గర చేసి ఆ ఖండాల మధ్య సరుకుల రవాణాని సుగమం చేస్తే సోమాలియా పైరేట్లు ఆ దగ్గరని మళ్లీ దూరం చేస్తున్నారు. వారికి భయపడే కొన్ని దేశాలు ఇప్పుడు తమ నౌకల్ని మళ్లీ ఆఫ్రికా ఖండం చుట్టూ తిప్పి తీసికెళుతున్నాయి. రవాణా వ్యయం పెరిగినా పర్వాలేదని 'కేప్ ఆఫ్ గుడ్‌హోప్' గుండా వెళ్తున్నాయి. దాని వల్ల గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో ఓడల రాకపోకలు తగ్గడంతో పైరేట్లు ఇప్పుడు హిందూమహాసముద్రంలో కూడా నౌకలపై దాడులకు దిగుతూ తమ పరిధిని విస్తరించుకుంటూ పోతున్నారు. చాండ్లర్ దంపతుల్ని హైజాక్ చేసింది సోమాలియాకి దక్షిణాన ఉన్న టాంజానియా సమీపంలో అయితే, సైరస్ స్టార్‌పై దాడి చేసింది కెన్యా సమీపంలో. ఈ పైరేట్లు ఎంతగా విస్తరించారంటే అరేబియా సముద్రంలో మనదేశ దక్షిణ తీరానికి 300 మైళ్ల దూరంలో కూడా వాళ్లు నౌకని హైజాక్ చేశారు. అక్కడి నుంచి సోమాలియా 1,500 మైళ్ల దూరంలో ఉందంటే వాళ్ల పరిధిని ఎంతగా పెంచుకుంటూ పోతున్నారో ఊహించుకోవచ్చు.

2008లో 111 నౌకలపై దాడులు చేసి 40 నౌకల్ని హైజాక్ చేశారు ఈ పైరేట్లు. 2009లో 217 నౌకలపై దాడి చేసి 47 నౌకల్ని తమ అధీనంలో ఉంచుకున్నారు. ఇప్పటికీ వీటిలో కొన్నిటిని మాత్రమే విడిచి పెట్టారు. మిగతావన్నీ వారి చేతిలోనే ఉన్నాయి. హైజాక్ చేసిన ఓడల్ని సముద్రం మధ్యలో నిలిపి వాటిని కేంద్రంగా చేసుకుని మరిన్ని ఓడల్ని హైజాక్ చేస్తున్నారు. తమ అధీనంలో ఉన్న ఓడలో నుంచి వేరే ఓడల్ని పసిగట్టడం.. అవిసమీపంలోకి రాగానే తమ ఓడ అపాయంలో ఉందని తప్పుడు సంకేతాలు పంపించడం తీరా అది దగ్గరకి వచ్చాక తమ వద్ద ఉన్న మిషన్ బోట్‌లలో వెళ్లి వాటిపై మారణాయుధాలతో దాడులకు దిగడం వీరికి అలవాటై పోయింది.

మూడు రకాల నైపుణ్యం అవసరం

చేతుల్లో ఎకె 47 రైఫిళ్లు, రివ్వున దూసుకుపోయే పడవలు, వాటిపై రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లు, సముద్రంలో తామెక్కడున్నామో తెలియజేసే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలు, శాటిలైట్ ఫోన్లు పైరేట్ల పనిని సులువు చేస్తున్నాయి. పైరేట్లలో ఎక్కువ శాతం ఈశాన్య సోమాలియాలోని 'పుంట్‌ల్యాండ్' ప్రాంతానికి చెందినవారు. పైరేట్లలో చాలామంది ఒకప్పటి మత్స్యకారులే అయినా ఇప్పుడున్న పైరేట్ల బృందాల్లో ముఖ్యంగా మూడు రకాల వ్యక్తులున్నారు. మొదటి వర్గం జాలరులు. వేట వీరికి కొట్టిన పిండే.. బోట్లు నడపడంలో సుశిక్షితులు, పైగా సముద్రంలో తుపానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తమని తాము ఎలా రక్షించుకోవాలో వీళ్లకి బాగా తెలుసు. రెండో వర్గం మిలిటెంట్లు. సోమాలియాలో నిత్యం జరిగే జాతుల వైరం వల్ల ఆ జాతులకి సైన్యాలు కూడా ఉంటాయి. వాళ్లిప్పుడు పైరేట్లుగా మారుతున్నారు. గన్‌లు, రాకెట్ లాంచర్లతో ఓడలపై దాడులు చేసేది వీళ్లే. మూడో రకం జిపిఎస్ పరికరాల్ని ఉపయోగించడం తెలిసిన వాళ్లు.

పదేళ్ల క్రితం దాకా చిన్నచిన్న జట్లుగా దాడులకు పాల్పడిన పైరేట్లు ఇప్పుడు అతిపెద్ద మాఫియాగా ఎదిగారు. ఆ దేశంలోని బడా వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు కూడా ఈ దారి దోపిడీలను ప్రోత్సహిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేసే సోమాలియన్లు ఆ గల్ఫ్‌కి వచ్చివెళ్లే నౌకల సమాచారాన్ని సోమాలియాలోని తమ వాళ్లకి క్షణాల్లో చేరవేస్తున్నారు. అందుకే ఏయే నౌకలు ఏ సరుకులతో వస్తున్నాయో, అవి ఎప్పటికి సోమాలియా తీరానికి చేరుకుంటాయో వారికి ముందే తెలిసిపోతుంది. ఈ దోపిడీలు పెరగడం వల్ల ఆ దేశంలో మారణాయుధాలకి బాగా గిరాకీ ఏర్పడింది. ఎక్కువగా యెమెన్ నుంచి ఆయుధాలు దిగుమతి అవుతాయి. పైరేట్ల పుణ్యమా అని సోమాలియా రాజధానిలో కూడా పెద్ద పెద్ద ఆయుధాల మార్కెట్‌లు వెలిశాయట.

ఈ మాఫియా పెరిగి పెద్దయి కోట్ల డాలర్లు డబ్బు వస్తుండడంతో పైరేట్ల లీడర్లు రకరకాల కార్లు, బంగ్లాల్లో విలాస జీవితాల్ని గడుపుతున్నారు. వారిని చూసి మరెందరో అదే బాట పడుతున్నారు. అందుకే ఆ దేశంలో నేను పైరేట్‌ని అని చెప్పుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందట. సోమాలియాలో బడా వ్యాపారులు సైతం అప్పు కావాల్సి వస్తే పైరేట్లనే ఆశ్రయిస్తున్నారు.

అరాచకంలోనూ ఐకమత్యం

నిత్యం జాతుల వైరం, రక్తపాతం జరిగే సోమాలియాలో పైరేట్ల మధ్య మాత్రం ఎలాంటి వైరాలూ ఉండవు. వాళ్ల మధ్య ఐక్యత చూసిన వాళ్లు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. డబ్బే వారిని ఒకటి చేస్తుంది. పైరేట్లు డబ్బు కోసం ఎప్పుడూ ఒకరిని ఒకరు చంపుకోరట. పదేళ్లుగా ఈ దోపిడీలు ఉధృతంగా జరుగుతున్నా ఇంతవరకూ పైరేట్ గ్యాంగ్‌ల మధ్య ఎలాంటి వైరం రాలేదట. వాళ్ల గురించి ఇంకో విషయం కూడా ఘనంగా చెప్పుకుంటారు. బందీలని ఎన్ని రోజులైనా సరే చాలా బాగా చూసుకుంటారు. చాండ్లర్ దంపతులు కూడా ఆ విషయం చెప్పారు. పైరేట్లకికావాల్సింది డబ్బే కాని బందీల ప్రాణాలు కాదు కాబట్టి బందీల ప్రాణాలు తీయడం అరుదు. చాలా సందర్భాల్లో పైరేట్లకి డబ్బు హెలికాప్టర్ల నుంచి జారవిడుస్తారు. ఒక్కోసారి వాటర్‌ప్రూఫ్ సూట్ కేసుల్లో పడవల్లో పంపిస్తారు. ఆ డబ్బుని 'ఫారిన్ ఎక్స్‌ఛేంజ్' కార్యాలయాల్లో ఉపయోగించే మిషన్లతో లెక్కిస్తారు.

ఎలా మొదలైంది..?

ఆఫ్రికా ఖండం మొత్తంలో పొడవైన తీరరేఖ ఉన్న దేశం సోమాలియా. కొండలు గుట్టలతో నిండి ఉండే ఆ దేశంలో సహజవనరులు అంతంత మాత్రమే. తీర రేఖ వెంబడి నివసించే జనాభాకి చేపల వేట తప్పమరో జీవనాధారం లేదు. ఆ దేశంలో దశాబ్దాల పాటు కొనసాగిన మిలిటరీ పాలన 1991లో అంతమైన తర్వాత జాతుల మధ్య వైరాలు మరీ ఎక్కువయ్యాయి. అరాచకం పెచ్చరిల్లింది. తర్వాత ఏర్పడిన ప్రభుత్వం పని తీరు అంతంత మాత్రమే. అందుకే ఆ దేశ తీరాన్ని పరిరక్షించడానికి ఎలాంటి రక్షణ దళం లేకుండా పోయింది. అది పాశ్చాత్య దేశాల పాలిట వరమైంది. ఫలితంగా విదేశాలకి చెందిన చాలా నౌకలు సోమాలియా తీరంలో ప్రవేశించి చేపలు పట్టడం, వారి జల వనరుల్ని దోచుకోవడం ఎక్కువైంది. దీనికి తోడు పలు పాశ్చాత్య దేశాలకు చెందిన కంపెనీలు రకరకాల వ్యర్థాలను సోమాలియా సముద్ర జలాల్లో వదిలేయడం మొదలుపెట్టాయి.

ఇలా రెండు రకాలుగా సోమాలియా జలాల్ని కలుషితం చేసి ఆ దేశ మత్స్యకారుల పొట్టగొట్టారు. సోమాలియా తీర జలాలలో యురేనియం, సీసం, భారలోహాలైన కాడ్మి యం, పాదరసంతో పాటు పారిశ్రామిక వ్యర్థాలు, ఆస్పత్రుల నుంచి వచ్చే వ్యర్థాలు, మరెన్నో రసాయనాలు ఉన్నాయని 2005లో ఐరాస పేర్కొంది. తమ వనరుల్ని హరించి వేసిన విదేశీలపై సహజంగానే సోమాలియా తీరప్రాంత ప్రజలకి ద్వేషభావం పెరిగిపోయింది. దాంతో ఆ మత్స్యకారులు తమ జలాల్లోకి ప్రవేశించిన విదేశీ ఓడల్ని హైజాక్ చేయడం మొదలుపెట్టారు. ఆకలి చావులు సర్వ సాధారణమైన సోమాలియాలో ఇప్పుడు ఈ దోపిడీయే ఎంతో మందికి జీవనాధారమైంది. ఆకలితో చావలేని యువకులు ఈ గ్యాంగుల్లో చేరి తమ జాతకాల్ని పరీక్షించుకుంటున్నారు. విషాదమేమిటంటే.. పదిహేనేళ్ల లోపు బాలలు కూడా ఈ చోర జల క్రీడల్లో పాల్గొని నేరస్తులుగా మారుతున్నారు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లాంటి దేశాల్లో 'చైల్డ్ సోల్జర్'లు (బాల సైనికులు) ఎలాగైతే ఉగ్రవాదుల కార్యకలాపాల్లో పావులవుతున్నారో అలాగే సోమాలియాలో బాల పైరేట్లు తయారవుతున్నారు. మన దేశ నౌకాదళానికి చిక్కిన 61 మందిలో 25 మంది 15 ఏళ్ల వయసులోపు వారే. వారిలో నలుగురి వయసైతే 11 ఏళ్లే.

వాణిజ్యాన్ని దెబ్బతీసింది

సోమాలియా దోపిడీలు దాని సమీప దేశాల వ్యాపారాలను కూడా భారీగా దెబ్బతీశాయి. పైరేట్లకి భయపడి సూయజ్ కాల్వ గుండా రాకపోకలు తగ్గడం వల్ల ఈజిప్టు ఆదాయానికి కూడా గండి పడింది. కెన్యా, యెమెన్ దేశాల వాణిజ్యాన్ని దెబ్బ తీసింది కూడా ఈ దొంగలే. సోమాలియా పక్కనే ఉన్న సీషెల్స్‌కు వచ్చే టూరిస్టులు దీని వల్ల బాగా తగ్గిపోయారు. సమీప దేశాల్నే కాదు.. అంతర్జాతీయ వాణిజ్యానికికూడా పెను సవాలుగా మారారు వీళ్లు. యుద్ధ నౌకల్లో తప్ప వాణిజ్య నౌకల్లో మారణాయుధాలు నిషేధిస్తారు కాబట్టి ఆ ఓడల సిబ్బందిని పైరేట్లు మారణాయుధాలతో బెదిరించి చాలా సులభంగా తమ అధీనంలోకి తెచ్చుకోగలుగుతున్నారు.

నిరోధక చర్యలు

అంతర్జాతీయ వాణిజ్యానికి ముప్పు వాటిల్లడంతో ఐరాస భద్రతా మండలి నిరోధక చర్యలు చేపట్టాలని తీర్మానించింది. దాంతో అమెరికా, కెనడా, చైనా, జపాన్‌తో పాటు పలు దేశాలు ఈ దాడులను నిరోధించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం 'కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 150', 'కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 151', 'ఆపరేషన్ అట్లాంటా' - అనే మూడు అంతర్జాతీయ 'యాంటీ పైరేట్ టాస్క్ ఫోర్స్‌లు' ఇటు అరేబియా సముద్రంలోనూ, అటు హిందూ మహాసముద్రంలోనూ పహారా కాస్తున్నాయి. దాంతో పాటు వివిధ దేశాల యుద్ధ నౌకలు కూడా తమ వాణిజ్య నౌకలను కాపాడుకుంటున్నాయి. మన దేశ నౌకాదళం కూడా హిందూ మహా సముద్రంలో 'యాంటీ పైరేట్ ఆపరేషన్' చేపట్టి చాలా నౌకల్ని పైరేట్ల దాడి నుంచి కాపాడ గలిగింది.

ఈ టాస్క్ ఫోర్స్‌లన్నీ కలిసి వందలమంది సోమాలియా పైరేట్లను నిర్బంధించాయి.. అలా దొరికిన వాళ్లందరూ వివిధ దేశాల జైళ్లలో మగ్గుతున్నారు. ఎన్ని చర్యలు చేపట్టినా ఎక్కడో ఒకచోట ఏదో ఒక విధంగా పైరేట్లు తమ పంజా విసురుతూనే ఉన్నారు. ఈ దోపిడీల్ని పూర్తిగా నిరోధించలేకపోవడానికి విశ్లేషకులు చెపుతున్న కారణమేమంటే సోమాలియా పైరేట్ల వల్ల జరిగే నష్టం కంటే యుద్ధ నౌకలు ఆ ప్రాంతాల్లో నిత్యం పహారా కాయడానికి అయ్యే ఖర్చు ఎక్కువట. అందుకే పాశ్చాత్య దేశాలు తీవ్రంగా స్పందించడం లేదనే వాదన కూడా ఉంది. పైగా మీరే మా వనరుల్ని హరించి వేశారని సోమాలియన్లు ఎదురుదాడికి దిగితే ఆ దేశాలు తప్పు ఒప్పుకోవాల్సి వస్తుంది. విదేశీ నౌకలు ఎన్ని చేసినా పైరేట్లను అరికట్టాలంటే ఆ దేశంలో స్థిరమైన, బలమైన ప్రభుత్వం ఉండాలి.. అది లేదు అక్కడ. అయినా అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో పైరేట్లను అరెస్టు చేసే పనిలో పడింది. అక్కడి ప్రభుత్వం వారికి ప్రత్యేక జైలు కూడా కట్టించింది.

హాలీవుడ్‌నీ ఆకర్షించింది

అంతర్జాతీయ సమాజాన్నే కాదు ఈ సముద్రపు దొంగలు రచయితల్నీ, హాలీవుడ్‌ని కూడా ఆకర్షించారు. ఒక నవల, ఒక యదార్ధ అనుభవం ఇప్పటికే పుస్తకాలుగా వచ్చాయి. 'దోజ్ ఇన్ పెరిల్' అనే నవలని విల్బర్ స్మిత్ రచిస్తే పైరేట్ల చెరనుండి బయట పడిన ఓ అమెరికన్ నౌక కెప్టెన్ తన అనుభవాన్ని వివరిస్తూ 'ఎ కెప్టెన్స్ డ్యూటీ' అనే పుస్తకం రాశారు. దీని ఆధారంగా తీస్తున్న హాలీవుడ్ సినిమాలో ఉత్తమ నటుడిగా రెండుసార్లు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న టామ్ హాంక్స్ కెప్టెన్‌గా నటిస్తున్నాడు. కథ ఏమిటంటే... 2009లో 'మెరెస్క్ అలబామా' అనే అమెరికన్ నౌకని నలుగురు సోమాలియన్ పైరేట్లు హైజాక్ చేశారు. నౌక సిబ్బంది వారిపై తిరగబడ్డారు. ఆ క్రమంలో ఒక పైరేట్ నౌక సిబ్బందికి చిక్కితే నౌక కెప్టెన్ రిచర్డ్ ఫిలిప్ పైరేట్లకి చిక్కాడు. మా వాణ్ణి విడిచిపెడితే కెప్టెన్‌ని వదిలేస్తామని హామీ ఇచ్చినపైరేట్లు ఆడిన మాట తప్పి కెప్టెన్‌ని తీసుకుని బోట్‌లో పారిపోతారు. సముద్ర జలాల్లోనే తిరుగుతూ అమెరికాతో బేరాలు సాగిస్తారు. వారితో ఓ వైపు చర్చలు జరుపుతూనే మరో వైపు అమెరికన్ నౌకాదళం తమ బలగాలను మొహరిస్తుంది. చివరికి ముగ్గురు పైరేట్లని హతమార్చి కెప్టెన్‌ని రక్షిస్తుంది.

టీవీ తెరపై తిరుగులేని తార ఓప్రా విన్‌ఫ్రే

తానెంతగానో అభిమానించి ఆరాధించే టీవీ యాంకర్‌ని చూడడానికి శ్రియ పిల్గోంకర్ అనే ఇరవైరెండేళ్ల యువతి ముంబయి నుంచి అమెరికా వెళ్లింది. ఆ యాం కర్ నిర్వహించే టీవీ షో ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చునే అవకాశం దొరికినపుడు ఆమె పడిన సంతోషం అంతా ఇంతా కాదు. సినీ తారలు, పాప్ సింగర్లంటే పడిచచ్చేవాళ్లని చూశాం కాని టీవీ యాంకర్లకి కూడా అభిమానులుంటారా అని ఆశ్చర్యపోతున్నారా. ఆ టీవీ యాంకర్ అంటే ప్రపంచానికున్న అభిమానం మరే తారకీ లేదు. ఆమే పాతికేళ్లపాటు టీవీషో నిర్వహించి ప్రపంచ టెలివిజన్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా అమెరికాని 'ఓప్రాఫికేషన్' చేసిన ఒక నల్లజాతి అమెరికన్ మహిళ.. ఓప్రా విన్‌ఫ్రే.
------------------------
25, మే 2011.. ప్రపంచ టెలివిజన్ చరిత్రలో ఒక అధ్యాయానికి తెరపడింది. 1986 మొదలై 145కి పైగా దేశాల్లో ప్రసారమవుతూ వస్తున్న 'ది ఓప్రా విన్‌ఫ్రే షో' ఆ రోజుతో ముగిసింది. పాతికేళ్లుగా అమెరికాలో ఇంటిల్లిపాదికీ సుపరిచితమైన ఓప్రా విన్‌ఫ్రే చివరిసారి టీవీలో కనిపించే ఎపిసోడ్‌ని ఆ దేశంలో సినిమా థియేటర్లలో కూడా లైవ్‌గా ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా బార్లు, పబ్‌లలో ఓప్రా అభిమానులు చేరి టీవీషో చూస్తూ వీడ్కోల పండుగ జరుపుకున్నారు. ఆమెరికా ఆమెని అంతగా ఆరాధించడానికి కారణమేమిటి? ఓప్రా విన్‌ఫ్రే కేవలం టీవీ యాంకర్ మాత్రమే కావచ్చు. అమెరికన్ సంస్కృతిని పాతికేళ్లుగా మరెవరూ చేయలేనంతగా ప్రభావితం చేసిందని సామాజిక శాస్త్రవేత్తల పరిశోధనలు నిరూపించాయి.

అమెరికాలోనే కాదు, ఆమె షో ప్రసారమైన అన్ని దేశాల్లోనూ ఆమెకి అభిమానులున్నారు. అలాగని ఓప్రా టీవీషో నిర్వహించిన మొదటి వ్యక్తేమీ కాదు. ఆమె రాకకి ముందునుంచే టీవీ టాక్‌షోలు నడుస్తున్నాయి. అయితే ఆమె మాట్లాడే విధానం, ఎదుటి వ్యక్తులనుంచి సమాధానాలు రాబట్టే నేర్పరితనంతో తనదైన శైలిలో యాంకరింగ్‌లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందామె. అందుకు ఆమె వ్యక్తిత్వంతోపాటు జీవితం నేర్పిన పాఠాలూ దోహదపడ్డాయి. ఒక్క టీవీషో ద్వారా అమెరికన్ జీవితాల్లోకి అన్ని కోణాలనుంచి చొచ్చుకుపోగలిగింది. టాక్‌షోలలో సెలబ్రిటీలపై వచ్చే గాసిప్‌లను, బ్యూరోక్రాటిక్‌గా సాగే చర్చలను కాదని సామాన్య ప్రజల జీవితాలే కేంద్రంగా టీవీషో కొనసాగించింది. జనం బయటకు చెప్పుకోలేని ఎన్నో విషయాల గురించి తన షోలో చర్చిస్తూ వాటిని అమెరికన్ సమాజమంతా బహిరంగంగా చర్చించుకునేలా చేసింది ఓప్రా. అందుకే అమెరికన్లకి ఆమె అంటే అంత అభిమానం.

తల్లి పిల్లలతో మాట్లాడినట్లే..
తల్లి తన పిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడుతూ తనషోకి వచ్చిన అతిథుల మదిలోయల్లోకి చొచ్చుకుపోతుంది ఓప్రా. అందుకేనేమో ఆమె అడిగితే చాలు ఎంతటి వారైనా తమ మనసులో ఉన్నదాన్నంతా బయట పెట్టేవాళ్లు. ఒక్కోసారి భోరున ఏడ్చేసేవాళ్లు, ఒక్కోసారి పట్టలేని సంతోషంతో పిచ్చిగంతులేసేవారు... ఆత్మన్యూనతని పక్కన పెట్టి సగర్వంగా తమ గురించి చెప్పుకునేవాళ్లు. ఎవరి గురించి వాళ్లు చెబుతూ ఉంటే తన జీవితంలో జరిగిన సంఘటనల్ని ప్రస్తావిస్తూ ఆ ఇంటర్వ్యూలని పరిపూర్ణం చేసేది ఆమె. అందుకే వారం వారం ప్రసారమయ్యే ఆమె షో కోసం అమెరికా పడిగాపులు కాసేది. ఆ అభిమానమే ఆమెని 20వ శతాబ్దంలో అత్యంత ధనవంతురాలైన నల్లజాతి వ్యక్తిగా నిలిపింది. కడుపేదరికంలో పుట్టిన ఓప్రా అంత అభిమానాన్ని ఆస్తిపాస్తుల్ని సంపాదించే దిశగా చేసిన పయనంలో ఎన్నో కష్టనషాల్ని చవిచూసింది.

పేదరికం నుంచి..
ఓప్రా విన్‌ఫ్రే 1954 జనవరి 29న మిసిసిపీలో ఒక టీనేజి పెళ్లికాని అమ్మాయికి జన్మించింది. ఆమె తల్లి ఇళ్లల్లో పనిచేసేది. ఓప్రా అసలు పేరు ఓర్పా గెయిల్ విన్‌ఫ్రే. ఓర్పా కాస్తా వాడుకలో ఓప్రా అయిపోయింది. తొమ్మిదేళ్ల వయసులో అత్యాచారానికి గురయ్యానని ఒకసారి తన షోలో చెప్పింది ఓప్రా. ఏళ్లపాటు అత్యాచారానికి గురైన ఆమె 13 ఏళ్లవయసులో ఇల్లొదిలి పారిపోయింది. పద్నాలుగేళ్ల వయసులో మగబిడ్డకి జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ పురిట్లోనే చనిపోయాడు. అప్పట్నించి నేటికీ ఆమె పెళ్లి చేసుకోలేదు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో వక్తృత్వపోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు సాధించింది. ఆ పోటీల్లో గెలుపుతో యూనివర్శిటీ చదువుకి ఫెలోషిప్ సంపాదించి నల్లజాతి విద్యార్థులకు పెట్టింది పేరైన టెన్నెస్ స్టేట్ యూనివర్శిటీలో చేరింది.

ఓ పక్క చదువుకుంటూనే స్థానిక రేడియో స్టేషన్లో వార్తలు కూడా చదివిన ఆమె ఆ రేడియోలో పనిచేసిన పిన్నవయస్కురాలే కాదు, మొట్టమొదటి నల్లజాతి యాంకర్ కూడా ఆమే. రేడియో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకత సాధించుకున్న ఓప్రా 1983లో టెన్నెస్ నుంచి చికాగోకి మకాం మార్చింది. ఓ రేడియో స్టేషన్‌లో ఉదయం వార్తా కార్యక్రమాన్ని నిర్వహించడం మొదలుపెట్టింది. ఓప్రా రంగ ప్రవేశంతో కొన్ని నెలల్లోనే రేటింగ్‌లో ఎక్కడో చిట్టచివరి స్థానంలో ఉన్న ఆ కార్యక్రమం మొట్టమొదటి స్థానానికి ఎగబాకింది. ఓప్రా ఇంటర్వ్యూ చేసే తీరు, ఆమె నైపుణ్యాన్ని గమనించిన సినీ విమర్శకుడొకరు ఆమెని టెలివిజన్ షో చెయ్యమని సలహా ఇచ్చాడు. కార్యక్రమాన్ని దేశమంతటా టీవీ చానళ్లకు అమ్మవచ్చని, ఖచ్చితంగా జనాన్ని ఆకర్షించగలుగుతుందని చెప్పాడు. ఆయన సలహాతోటే 'ది ఓప్రా విన్‌ఫ్రే షో' అనే పేరుతో ఆమె సొంతగా టెలివిజన్ షో నిర్మించే పనిలో పడింది.

ది ఓప్రా విన్‌ఫ్రే షో
1986, సెప్టెంబర్ 8న దేశవ్యాప్తంగా ఓప్రా విన్‌ఫ్రే షో ప్రసారమైంది. అప్పటికి నెంబర్‌వన్ స్థానంలో ఉన్న షోని కొన్ని వారాల్లోనే పక్కకి నెట్టి మొదటి స్థానాన్ని ఆక్రమించింది. టీవీ షోలలో తెల్లజాతి మగవాళ్ల హవా నడుస్తున్న సమయంలో ఒక నల్లజాతి స్త్రీ వాళ్లని వెనక్కి నెట్టి తిరుగులేని యాంకర్‌గా వార్తల్లోకెక్కింది. క్రమంగా శాటిలైట్ టెలివిజన్ అంతర్జాతీయంగా విస్తరించడంతో ఆమె షో కూడా ప్రపంచవ్యాప్తమైంది. ఇప్పటికీ ఆ షోకి పోటీ వచ్చిన షో మరోటి లేదంటే ఆమె ఎంచుకున్న అంశాలు అలాంటివి. స్థానిక సమస్యల నుంచి ప్రపంచ రాజకీయాల దాకా, గుండెజబ్బు నుంచి ఎయిడ్స్ దాకా, స్వలింగ సంపర్కులపై వివక్ష నుంచి ఆధ్యాత్మిక చింతన దాకా ఆమె స్పృశించని అంశం లేదు. 1993లో ఓప్రా విన్‌ఫ్రే మైకెల్ జాక్సన్‌ని తన షోకి ఆహ్వానించింది.

ఇద్దరు నల్లజాతి తారల్ని ఓ చోట చేర్చిన ఆ కార్యక్రమం అమెరికన్ టెలివిజన్ చరిత్రలోనే అతి ఎక్కువమంది వీక్షించినదిగా రికార్డులకెక్కింది. నోబెల్ గ్రహీత, అమెరికన్ నల్లజాతి రచయిత్రి టోని మారిసన్ రచించిన 'బిలవెడ్'ని వెండితెరపై నిర్మించి నటించింది. మరో నల్లజాతి రచయిత్రి ఆలిస్ వాకర్ రచించిన 'ది కలర్ పర్పుల్'ని స్టీవెన్ స్పీల్‌బర్గ్ నిర్మిస్తే, దాన్లో నటించి ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ నామినేషన్ కూడా సాధించింది. ఒక విజయం మరిన్ని విజయాలకు బాట వేస్తుందనేది ఓప్రా విషయంలో ముమ్మాటికీ నిజమైంది.

2000 సంవత్సరంలో ఆమె ప్రారంభించిన 'ఒ-ది ఓప్రా మ్యాగజైన్' మాసపత్రిక 27 లక్షల కాపీల సర్క్యులేషన్‌తో నడుస్తోంది. ఆ మ్యాగజైన్ దక్షిణాఫ్రికా ఎడిషన్ కూడా అంతే స్థాయిలో ఆదరణ పొందింది. ఓప్రాకి ఉన్న ఆదరణని గమనించిన డిస్కవరీ కమ్యూనికేషన్స్ సంస్థ ఆమెతో సంయుక్తంగా ఒక చానల్ నడపడానికి ముందుకొచ్చింది. ఈ సంవత్సరం జనవరిలో 'ఓప్రా విన్‌ఫ్రే నెట్‌వర్క్' పేరుతో ఆ టీవీ చానల్ మొదలైంది.

పుస్తక ప్రచురణపై ఓప్రా మార్కు
ఓప్రా విన్‌ఫ్రే ఐదు పుస్తకాలకు సహరచయిత కూడా. 2005లో ఆమె తన వ్యక్తిగత ట్రెయినర్ బాబ్ గ్రీన్‌తో కలిసి బరువు తగ్గడంపై పుస్తకం రాసింది. ఆ పుస్తకానికి వచ్చిన పారితోషకం కూడా ఒక రికార్డే. ప్రపంచంలో ఏ రచయితకీ చెల్లించనంత ఎక్కువ మొత్తాన్ని ఆమెకి చెల్లించారని వార్తలొచ్చాయి. అప్పటి దాకా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ జీవితచరిత్రకి లభించిందే అతి ఎక్కువ మొత్తం. పుస్తకాలు రాయడమే కాదు ఓప్రా తన షోలో పుస్తకాల గురించి కూడా చర్చించేది. దానికి ఓప్రా బుక్ క్లబ్ అనే పేరు పెట్టిందామె. ఏదైనా పుస్తకం ఆ క్లబ్‌లో స్థానం సంపాదించడమంటే ఒక పెద్ద అంతర్జాతీయ అవార్డు రావడంతో సమానం.

బుక్ క్లబ్‌లో చేరిన పుస్తకాల అమ్మకాలు అమాంతం పెరిగిపోయేవి. ఒక్క రోజులోనే లక్షల కాపీలు అమ్ముడు పోయేవి. లైబ్రరీలన్నీ ఆ పుస్తకాలు తప్పక తెప్పించి పెట్టేవి. ఓప్రా క్లబ్‌లో చేరిన పుస్తకాల సెక్షన్లు షాపుల్లో ప్రత్యేకంగా ఉండేవి. ఓప్రాఫికేషన్ అనే కొత్త పదం ఇంగ్లీషు డిక్షనరీలో చేరింది. బహిరంగంగా నిజాన్ని ఒప్పుకునే అలవాటు అమెరికన్లలో పెంపొందడానికి ఓప్రా షోయే కారణమని వాల్ స్ట్రీట్ జర్నల్ కొనియాడింది. ఆమె ప్రభావంతో పాశ్చాత్య ప్రపంచంలో మెమోయిర్‌లు రాయడం పెరిగింది కూడా ఓప్రాఫికేషన్ వల్లే.

అంత్యంత ప్రభావశీల మహిళ
సిఎన్ఎన్, టైమ్ మ్యాగజైన్ రెండూ ఓప్రాని ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల మహిళగా పేర్కొన్నాయి. అలాంటి మరెన్నో జాబితాల్లో ప్రభావశీలమైన వ్యక్తిగా ఎన్నికవ్వడం ఆమెకి సర్వసాధారణమైపోయింది. చివరికి బరాక్ ఒబామా కూడా ఓప్రా 'ఓప్రా అమెరికాలో అత్యంత ప్రభావశీల వ్యక్తి కావచ్చేమో' అని పేర్కొన్నాడు. నిజమే.. ఆడతనమంటే అది ఓప్రాలా ఉండాలని అమెరికన్ అమ్మాయిలన్నారంటే ఆమెపై వారికున్న అభిమానం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

కాలిఫోర్నియాలోని 'ది ప్రామిస్డ్ ల్యాండ్' అనే 42 ఎకరాల సువిశాల ఎస్టేట్‌లో ఉన్న విలాస భవనం ఆమె ప్రస్తుత నివాసం. ఇంకా చాలా నగరాల్లో ఆమెకి ఇళ్లున్నాయి. ప్రఖ్యాత నల్లజాతి అమెరికన్ రచయిత్రి మాయా ఎంజెలూ అంటే ఓప్రాకి ఎనలేని ప్రేమ, గౌరవం. 'ఆమే నాకు అక్క, తల్లి, స్నేహితురాలు' అని పేర్కొన్నదోసారి. పేదరికంలో పుట్టి పెరిగిన ఓప్రా 32 ఏళ్లకే మిలియనీరైంది. 41 ఏళ్లు వచ్చేనాటికి ఫోర్బ్స్ 400 మంది ధనవంతుల జాబితాలో ఉన్న ఏకైక నల్లజాతి వ్యక్తి అయింది. ఆమె ఆస్తి అప్పటికి 340 మిలియన్ డాలర్లు. 20వ శతాబ్దానికి గాను అత్యంత ధనవంతురాలైన ఆఫ్రికన్ అమెరికన్ ఆవిడే.

కేవలం సంపాదించడమే కాదు, దాన్నెలా ఖర్చు చేయాలో కూడా తెలుసు ఓప్రాకి. అందుకే 1998లో ఓప్రాస్ ఏంజెల్స్ నెట్‌వర్క్ పేరుతో ఒక సేవాసంస్థను స్థాపించి ఎనిమిది కోట్ల డాలర్లు విరాళాలు సేకరించి సేవాకార్యక్రమాలు నిర్వహించింది. అమెరికాలో మరే ఇతర సెలబ్రిటీ దానం చేయనంత డబ్బుని దానం చేసింది. ఒక్క 2007లోనే 303 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చిన ఆమె దక్షిణాఫ్రికాలో వీధి బాలల కోసం స్కూల్ కూడా నడుపుతోంది.

Saturday, March 26, 2011

లైట్‌హౌస్‌లో హాలిడే

సముద్రయానం చేసేవారికి తీరపు జాడ తెలియజేసే కాంతి రేఖలైన లైట్‌హౌస్‌లు ఇప్పుడు పర్యాటక కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఓ వైపు జిపిఎస్‌లు, రాడార్‌లు అమర్చుకొని నావికులకు మెరుగైన సేవలందిస్తూనే మరోవైపు టూరిస్టులనీ ఆకట్టుకుంటున్నాయి. అమెరికా, యూరప్‌లలో ఇప్పుడు ఇదో కొత్త తరహా టూరిజంగా రూపొందుతోంది. ఆ దేశాల మార్గంలోనే నడవాలనుకొంటోంది మన దేశం కూడా.. అందుకే లైట్‌హౌస్‌లకి కొత్త హంగులు సమకూర్చే పనిలో పడింది.

ప్రాచీన కాలంలో భూమి మీద నిర్మించిన అతి ఎత్తయిన కట్టడం లైట్‌హౌసే. అంతేకాదు.. ప్రపంచంలోని ఏడు ప్రాచీన వింతల్లో లైట్‌హౌస్ ఒకటి. ఆ లైట్‌హౌస్‌ని ఇప్పటి ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో క్రీస్తుపూర్వం రెండో శతాబ్దంలో నిర్మించారు. రెండో టాలమీ రాజు దీన్ని నిర్మించాడు. ఇప్పుడైతే తీరప్రాంతాల్లో ఏ రేవుకి వెళ్లినా అక్కడో లైట్‌హౌస్‌ని చూడొచ్చు కాని అప్పటికది పెద్ద విశేషమే. నేడు శాస్త్రసాంకేతిక రంగంలో ఎంతటి అభివృద్ధిని సాధించినా, జిపిఎస్‌లు, శాటిలైట్ ఫోన్లు లాంటి కొత్త పరికరాలు వచ్చినా లైట్‌హౌస్‌లు మాత్రం ప్రాధాన్యతను ఎన్ని కోల్పోలేదు. మన దేశంలో ఇప్పుడు మొత్తం 182 లైట్‌హౌస్‌లు పనిచేస్తుంటే వాటిలో 14 లైట్‌హౌస్‌లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఆ 14లో విశాఖపట్నంలోని డాల్ఫిన్స్ నోస్ లైట్‌హౌస్ కూడా ఉంది.

ఏడు జిల్లాలుగా...

లైట్‌హౌస్‌ల నిర్వహణా బాధ్యత కేంద్రప్రభుత్వానిది. మొత్తం 7517 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ వెంబడి ఉన్న 182 లైట్‌హౌస్‌లను 'డైరెక్టరేట్ ఆఫ్ లైట్‌హౌసెస్ అండ్ లైట్‌షిప్స్' అనే సంస్థ నిర్వహిస్తోంది. సముద్రయానం, రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ (మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్) అధీనంలో ఉంటుందీ సంస్థ. లైట్‌హౌస్‌ల నిర్వహణకోసం తీర రేఖని మొత్తం ఏడు జిల్లాలుగా విభజించారు. అవేంటంటే..1. జామ్‌నగర్, 2. ముంబై, 3. కొచ్చి, 4. చెన్నై, 5. విశాఖపట్నం, 6. కోల్‌కతా, 7. పోర్ట్‌బ్లెయిర్. లైట్‌హౌస్‌లను సాధారణంగా ఎత్తయిన ప్రదేశంలో కడతారు.

సుదూరం నుంచి కూడా కనిపించేలా వాటికి ఎరుపు, తెలుపు, నలుపు రంగులు వేస్తారు. విశాఖపట్నంలో ఉన్న డాల్ఫిన్‌నోస్ లైట్‌హౌస్‌కి నలుపు, తెలుపు రంగులు ఉంటాయి. అదే చెన్నైలో ఉన్న లైట్‌హౌస్‌కి ఎరుపు, తెలుపు ఉంటాయి. రంగుల్లో మాత్రమే కాదు, దాని నుంచి ప్రసరించే కాంతిలో కూడా ఒక్కో లైట్‌హౌస్‌ది ఒక్కో ప్రత్యేకత. కొన్నిట్లో హాలోజెన్ ల్యాంప్‌లు వాడితే కొన్నిట్లో ఎల్ఇడి ల్యాంప్‌లు వాడుతున్నారు. కొన్ని లైట్‌హౌస్‌లలో ఐదు సెకన్లకి ఒకసారి లైట్ వెలిగి ఆరిపోతే, కొన్నిట్లో కొన్నిట్లో ఆ వ్వవధి 10 సెకన్లు ఉంటుంది. కాంతి రంగులో కూడా తేడా ఉంటుంది. అందుకే లైట్‌హౌస్ నుంచి వెలువడుతున్న కాంతిని బట్టి అది ఏ తీరమో తెలుసుకుంటారు నావికులు. వెలుగుతూ ఆరిపోతూ ఉండే లైట్లు ఎందుకంటే.. ఓడలు తీరం దగ్గరికొచ్చేకొద్దీ తీరంలో ఉన్న మిగతా లైట్లు కూడా కనిపిస్తాయి. ఏది లైట్‌హౌసో పోల్చుకోవడానికి వీలుగా వెలుగుతూ ఆరిపోతూ ఉండే లైట్లను అమర్చారు.
లైట్‌హౌసులే కాదు. లైట్‌షిప్‌లు కూడా ఉంటాయి. కొన్ని తీరాలు లైట్‌హౌస్ నిర్మించడానికి అనుకూలంగా లేకపోవచ్చు. అలాంటి తీరాల్లో లైట్‌షిప్‌ని ఉంచుతారు. అది నీళ్లలో నిలకడగా తేలియాడుతూ లైట్‌హౌస్ చేసే పనే చేస్తుంది. మన దేశంలో అలాంటి లైట్‌షిప్ గుజరాత్ తీరంలోని కచ్‌లో మాత్రమే ఉంది.

లైట్‌హౌస్ లవర్స్

'డైరెక్టరేట్ ఆఫ్ లైట్‌హౌసెస్ అండ్ లైట్‌షిప్స్'లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఐసిఆర్ ప్రసాద్‌కి లైట్‌హౌస్‌లంటే ఎనలేని ఆసక్తి. ఆయన చాలా దేశాల్లో పర్యటించి లైట్‌హౌస్‌ల మీద పరిశోధన చేశారు. అమెరికన్లకి లైట్‌హౌస్‌లంటే ఎనలేని అభిమానమని అంటారాయన. "అమెరికన్లు ప్రపంచం మొత్తంలోనే లైట్‌హౌస్ ప్రేమికులు. ఎందుకంటే... అమెరికన్లలో ఎక్కువ శాతం ప్రజలు వలసవచ్చి స్థిరపడిన వారే. ఓడల్లో వస్తున్న తమ పూర్వీకులకు దారి చూపించింది లైట్‌హౌస్‌లేనని వారి నమ్మకం. లైట్‌హౌస్‌ల మీద వారికున్న అభిమానం ఒక తరం నుంచి మరోతరానికి వస్తూ లైట్‌హౌస్‌లు వారి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయి.

అందుకే వాళ్లు తమ పిల్లల్ని తీసుకెళ్లి లైట్‌హౌస్‌లను చూపించి, వాటి ప్రాధాన్యతని వివరిస్తారు. అంతగా ప్రేమిస్తారు కాబట్టే ఆ దేశంలో 'లైట్‌హౌస్ లవర్స్ క్లబ్‌లు, అసోసియేషన్లు' చాలా ఉన్నాయి. అంతటితో ఆగిపోకుండా నిరుపయోగంగా ఉన్న లైట్‌హౌస్‌ల పరిరక్షణ బాధ్యతలు చేపట్టడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తారంటే వారికున్న అనుబంధం ఏపాటిదో తెలుసుకోవచ్చు'' అని అంటారాయన. మొట్టమొదటి లైట్‌హౌస్ నగరమైన అలెగ్జాండ్రియా పౌర చిహ్నం లైట్‌హౌసే. ఆ నగరం జండాలోనూ అలెగ్జాండ్రియా యూనివర్శిటీ లోగో మీద కూడా కూడా లైట్‌హౌస్ ఉంటుంది. కట్టడాల్లోనే కాదు పాశ్చాత్య సాహిత్యంలో కూడా లైట్‌హౌస్ ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది.

చరిత్ర నిర్మాణంలో..

మన దేశ చరిత్రనే తీసుకుంటే సముద్రతీరం ప్రధాన పాత్ర పోషించింది. పోర్చుగీసు వాళ్లు, బ్రిటీషు వాళ్లు ఓడలెక్కి ఇండియా చేరి మనతో వర్తక వ్యాపారాలు సాగించింది సముద్రమార్గం ద్వారానే. నేటికీ 90 శాతం సరుకుల రవాణా ఓడలమీదే జరుగుతుంది. ఆ ఓడలకి రేవుల జాడ తెలుపుతుంది లైట్‌హౌసులే. సాంకేతికంగా ఎన్నో రకాల పరికరాలు వచ్చినా, జిపిఎస్ పరికరాలు సముద్రంలో ఉన్న వారికి తీరం ఏ దిశలో ఎంత దూరంలో తెలియజేస్తున్నా స్వయంగా తీరాన్ని చూడగలగడం వేరని అంటారు నావికులు. ఒక్కొకసారి తీరాల్లో భద్రతా కారణాల దృష్ట్యా జిపిఎస్ పరికరాల సిగ్నల్స్‌ను జామ్ చేస్తే.. అవి కరెక్టు సమాచారం ఇవ్వలేవు. అందుకే ఆ పరికరాలేవీ లైట్‌హౌస్‌కి ప్రత్యామ్నాయం కాలేకపోయాయి. ఇప్పుడు లైట్‌హౌస్‌లకు రాడార్లను అమర్చి ఓడలను లైట్‌హౌస్‌లతో అనుసంధానం చేస్తున్నారు.
తీర రేఖ చుట్టూ చుక్కల్లా నిల్చుని ఉండే లైట్‌హౌస్‌లు నావికులకు తీరం జాడ తెలపడమే కాదు రాడార్‌ల సాయంతో సముద్ర జలాల్లో ప్రవేశించే శత్రువుల ఆచూకి పసిగట్టడానికి కూడా ఉపయోగపడుతున్నాయి.

లైట్‌హౌస్ టూరిజం

లైట్‌హౌస్‌ల డైరెక్టరేట్ తన సేవల ద్వారా ఆదాయాన్ని రాబట్టుకుంటూ స్వయంసమృద్ధ సంస్థగా ఎదిగింది. భారత నౌకాశ్రయాల నుంచి రాకపోకలు సాగించే ఓడల నుంచి 'లైట్ డ్యూటీ' రూపంలో చాలా ఆదాయం వస్తోంది. ఇప్పుడు ఈ సంస్థ పర్యాటక రంగంలోకి అడుగు పెట్టబోతోంది. త్వరలో మీరు కూడా ఒకరోజు లైట్‌హౌస్‌లో గడిపి.. ఆ ఒక్కరోజూ లైట్‌కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించవచ్చు. కేంద్ర ప్రభుత్వం మీకా అవకాశాన్ని కలిగించాలని భావిస్తోంది. ఇప్పటికే అమెరికా, యూరప్‌లలో ఈ రకమైన లైట్‌హౌస్ టూరిజం అభివృద్ధి చెందింది. ఇప్పుడు మన దేశం కూడా ఆ బాటలో నడుస్తోంది. కొన్ని ఎంపిక చేసిన లైట్‌హౌస్‌లను మ్యూజియంలుగా అభివృద్ధి చేయాలని కూడా నిర్ణయించారు. వాటిలో ఉండడానికి గదులు, కేఫెటేరియా, ప్రేక్షకుల గ్యాలరీ, 4డి సినిమా హాలు, అక్వేరియంలు, గేమింగ్ జోన్లు, లేజర్‌షో, స్పా, రిసార్టులు లాంటి రకరకాల సౌకర్యాలు కూడా కల్పించబోతున్నారు.

* తమిళ ప్రాచీన గ్రంధం సిలప్పదిగారం (silappadigaram) లో లైట్‌హౌస్ ప్రస్తావన ఉంది. పూంపుహార్ రేవుకి చేరుకునేందుకు వీలుగా కావేరిపట్టణం తీరంలో ఒక సుందరమైన లైట్‌హౌస్ ఉందని ఆ గ్రంథంలో రాసి ఉంది.
* మనదేశంలో నేటికీ పని చేస్తున్న లైట్‌హౌస్‌లలో ప్రాచీనమైనది ఒరిస్సాలోని పరదీప్ రేవు వద్ద ఉన్న 'ఫాల్స్ పాయింట్ లైట్‌హౌస్'. దీన్ని 1838లో ప్రారంభించారు.
* ఏటా సెప్టెంబర్ 21న మన దేశంలో లైట్‌హౌస్ డే జరుపుకుంటారు. 1927, సెప్టెంబర్ 21న అప్పటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ 'లైట్‌హౌస్ బిల్'కి తన అనుమతి తెలిపాడు. అలా ఆరోజు లైట్‌హౌస్ డే అయింది.
* మన దేశంలో మొదట్లో లైట్‌హౌస్ దీపాల్లో కొబ్బరి నూనె వాడేవారు. కొబ్బరినూనెతో అయితే దీపం తెల్లగా వెలుగుతుందని.
* స్వాతంత్య్రం వచ్చేనాటికి మన దేశంలో 17 లైఫ్ మాత్రమే భారత ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. మరో 50 లైట్‌హౌస్‌లు తీరప్రాంతాల్లో ఉన్న సామంత రాజ్యాల అధీనంలో ఉండేవి.
* లైట్‌హౌస్‌లు ఎక్కువగా జనావాసాలకు దూరంగా తీర ప్రాంతాల్లో ఎక్కడెక్కడో నిర్మించాల్సి వస్తుంది కాబట్టి అక్కడ పని చేసే వారికి సరైన సదుపాయాలేవీ ఉండవన్నది వాస్తవం. 2004 లో సంభవించిన తుపాను తాకిడికి తమిళనాడు తీరంలోని నాగపట్టినం, కడలూర్ లైట్‌హౌస్‌లలో ఉద్యోగులు చనిపోయారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న ఇందిరాపాయింట్ లైట్‌హౌస్‌లో పనిచేస్తున్న మొత్తం 17 మంది ప్రాణాలు విడిచారు.
* గతేడాది తమిళనాడులోని పూంపుహార్‌లో ప్రారంభమైన లైట్‌హౌస్ మనదేశంలో నిర్మించిన వాటిలో కొత్తది.
* మన దేశ తీర రేఖ వెంబడి ప్రతి 30 నాటికల్ మైళ్లకి ఒక లైట్‌హౌస్ నిర్మించే కార్యక్రమాన్ని 2017 కల్లా పూర్తి చేయాలని డైరెక్టరేట్ సంకల్పించింది.

Thursday, March 17, 2011

లంచం బాధితులకీ ఓ వెబ్‌సైట్

'పాస్‌పోర్టు కోసం అప్లయ్ చేస్తే.. అడ్రస్ వెరిఫికేషన్ ఎప్పటికీ జరగడం లేదు.. పోలీసుకి 500 ఇస్తే కాని ఆ పని పూర్తికాలేదు' 'రైల్వే స్టేషన్‌లో ట్రాక్‌లను ఫోటో తీసినందుకు కెమెరా లాగేసుకున్నారు పోలీసులు. 400 ఇస్తేకాని కెమెరా తిరిగివ్వలేదు' 'నో పార్కింగ్ ఏరియాలో పెట్టిన బైక్‌ను తీసుకెళ్లిన పోలీసులు 1500 ఇస్తేకాని తిరిగివ్వలేదు. తీరా బండి తీసుకుని చూస్తే అందులో పెట్రోలు లేదు' 'బర్త్ సర్టిఫికెట్‌లో తల్లి పేరు తప్పు రాశారు, దాన్ని సరి చేయడానికి 1000 ఇచ్చుకోవాల్సి వచ్చింది'

'ఐ పెయిడ్ ఎ బ్రైబ్ డాట్‌కామ్' వెబ్‌సైట్‌లోకి వెళ్తే.. ఇలాంటి విషయాలు కొన్ని వేలు చూడొచ్చు. పని జరగక కొందరు, టైంకి పని జరగడానికి కొందరు.. మరేదారి లేనపుడు నిస్సహాయ స్థితిలో లంచం సమర్పించుకోక తప్పడం లేదు. అలాంటి వాళ్లు తమ తమ అనుభవాలను పంచుకోవడానికే కాకుండా అసలు లంచం ఏయే శాఖల్లో ఏయే రూపాల్లో ఎంతగా వేళ్లూనుకొందీ తెలుసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతోందీ వెబ్‌సైట్. బెంగుళూరులోని 'జనాగ్రహ' అనే ఎన్‌జీవో ఈ వెబ్‌సైట్‌ని రూపొందించింది.

లంచం తీసుకోవడమే కాదు.. ఇవ్వడం కూడా నేరమే అని ప్రభుత్వం టీవీల్లో, రేడియోల్లో అరిచి గీ పెడుతున్నా.. పత్రికల్లో ప్రకటనలిస్తున్నా, యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారుల వలలో అవినీతి చేపలెన్నో పడుతూనే ఉన్నా.. అవినీతిని తగ్గకపోగా ఆ విషవృక్షం వేళ్లు మరింత లోనికి వెళ్లి దాన్ని మరింత బలవత్తరం చేస్తూనే ఉన్నాయి. వరకట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే వారి సంఖ్య అయినా పెరుగుతున్నదేమో కాని లంచం తీసుకోకుండా పని చేసే ఉద్యోగుల సంఖ్య మాత్రం పెరగట్లేదని చెప్పొచ్చు. సమాజమెదుర్కొంటున్న చాలా సమస్యలపై పోరాడుతున్న ఉద్యమకారులు, కార్యకర్తలు కూడా లంచగొండితనం విషయానికొచ్చేసరికి ఆ పని చేసే సాహసం చేయట్లేదంటే అది ఎంత పెద్ద సమస్యో అర్థమవుతుంది. ఆ సమస్యపై పోరాడడానికే ఈ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్లో 'లంచం ఇచ్చాను', 'లంచం ఇవ్వడానికి నిరాకరించాను', 'లంచం ఇవ్వాల్సిన అవసరం రాలేదు', 'లంచం ఇవ్వను' అనే నాలుగు సెక్షన్లున్నాయి. 'లంచం ఇచ్చాను' సెక్షన్‌లో నాలుగు వేలకి పైగా ఎంట్రీలుంటే, 'లంచం ఇవ్వడానికి నిరాకరించాను' సెక్షన్‌లో నాలుగొందల ఎంట్రీలే ఉన్నాయి. 'లంచం ఇవ్వాల్సిన అవసరం రాలేదు'లో అయితే 170 మాత్రమే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే లంచం ఇచ్చిన వారితో పోలిస్తే ఇవ్వడానికి నిరాకరించిన వాళ్లు పదో వంతు మాత్రమే ఉన్నారని అర్థమవుతోంది.

హైదరాబాద్ విషయానికే వస్తే.. 'అమెరికా నుంచి విమానం దిగి ఎయిర్‌పోర్ట్‌లో అడుగు పెట్టానో లేదో.. నా మెడలో ఉన్న కెమెరాకు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతి లేదని చెప్పాడు ఎయిర్‌పోర్ట్ అధికారి. అవసరం లేదని వాదించినా వినలేదు. చివరికి 14 వేలు చెల్లిస్తే కాని వదిలిపెట్టలేదు. ఎలాంటి రిసీటూ ఇవ్వలేదు' అని లంచం ఇచ్చిన ఒకాయన తన బాధని వెళ్లగక్కాడు. మరొకరైతే.. లంచం అడగని అధికారుల మంచితనాన్ని కొనియాడుతూ.. 'నేను కాప్రా డివిజన్లో బిల్డింగ్ రెగ్యులేషన్ కోసం అప్లికేషన్ పెట్టాను. ప్లాన్‌తో పాటు పెనాల్టీ కూడా కట్టాను. పర్మిషన్ ఇస్తున్నారని తెలిసి వెళ్తే ఎలాంటి లంచం అడగకుండానే అధికారులు నాకు పత్రాలు అందజేశారు' అని లంచం అడగకపోవడం గొప్ప విషయంగా రాశాడు.

అవినీతిని అరికట్టడానికి జనమందరి మద్దతును కూడగట్టుకోవడానికే ఈ వెబ్‌సైట్‌ని రూపొందించామంటున్నారు జనాగ్రహ సంస్థ వాళ్లు. ఎవరైనా ఈ వెబ్‌సైట్లోకెళ్లి తమ అనుభవాల్ని పంచుకోవచ్చు. ఒకవేళ లంచం ఇవ్వడానికి నిరాకరించినా.. ఆ సంఘటనల గురించి కూడా రాయొచ్చు. అలా చేయడం వల్ల మాకేం లాభం అనుకోకండి. అలాంటి సంఘటనల గురించి తెలియజేయడం వల్ల ఏయే ప్రాంతాల్లో ఏయే రంగాల్లో లంచగొండితనం ఉందో తెలుసుకోవచ్చు. వాటి ఆధారంగా 'ప్రభుత్వ యంత్రాంగం పనితీరుని పరిశీలించే వీలుంటుంది. అవినీతిని నిరోధించడానికి, అవినీతి వ్యతిరేక చట్టాలు అమలయ్యేలా చూసే వీలుంటుంది' అని చెబుతున్నారు నిర్వాహకులు. దేశం నలుమూలల నుంచీ జనం తమ తమ అనుభవాలను పంచుకుంటున్నారు. తాము ఏయే పనులు పూర్తవడానికి ఎంత లంచం ఇచ్చామో తెలియజేస్తున్నారు. వెబ్‌సైట్‌లో వస్తున్న స్పందనను ఒకసారి పరిశీలిస్తే.. బెంగుళూరు నుంచి ఎక్కువమంది తాము లంచం చెల్లించినట్టు తెలుపుతున్నారు. ఆ తర్వాతి నాలుగు స్థానాల్లో ముంబై, చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీ ఉన్నాయి. నగరాలు, పట్టణాలు, టౌన్లు కలుపుకుని మొత్తం 270 చోట్లనుంచి ప్రజలు తమ అనుభవాల్ని ఈ వెబ్‌సైట్‌లో రాశారు, రాస్తున్నారు.

'జనాగ్రహ సెంటర్ ఫర్ సిటిజన్‌షిప్ అండ్ డెమొక్రసీ' అనే సంస్థ మన దేశంలోని చాలా పట్టణాల్లో నగరాల్లో ప్రభుత్వంతోను ప్రజలతోను కలిసి పనిచేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి పని చేసే సంస్థ. ఈ సంస్థని రమేష్ రామనాధన్, స్వాతి రామనాధన్ 2001లో స్థాపించారు. రోడ్లు, ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్ట్, మంచినీరు లాంటి ప్రజలందరూ ఎదుర్కొనే సమస్యలపై ఇది పనిచేస్తోంది. ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి జనం లంచం చెల్లించాల్సి రావడం వల్లే ఈ వెబ్‌సైట్‌ని రూపొందించామంటున్నారు వాళ్లు.
ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ ఉద్యమాలు ఎక్కువయ్యాయి. ఈ ఉద్యమంలో మీరు కూడా పాలు పంచుకోవాలనుకుంటే.. లంచం ఇచ్చినా, ఇవ్వడానికి నిరాకరించినా ఆ విషయాన్ని ఈ వెబ్‌సైట్‌లో రాయండి. లంచం బాధితులుగా మీ అనుభవాన్ని తోటివాళ్లు తెలుసుకునేలా చేయండి.

Tuesday, February 22, 2011

ఆటగాళ్ల వెనుక మాటగాళ్లు

సచిన్ టెండూల్కర్‌కి 'లిటిల్ మాస్టర్' అనే పేరెలా వచ్చింది?
హర్భజన్‌సింగ్‌కి 'టర్బొనేటర్' అనే పేరెవరు పెట్టారు?
లక్ష్మణ్ పేరుని ఎవరు 'వెరీ వెరీ స్పెషల్ ' చేశారు?
ద్రావిడ్‌ని 'ది వాల్' అంటూ అభివర్ణించిందెవరు?
'ఏమో... ఎవరు పెడితే ఏంటి? టీవీలో కామెంటరీ చెప్పేవాళ్లు మాత్రం వారినలాగే పిలుస్తారు' అంటారా? నిజమే.. పిలవడమే కాదు. ఆటగాళ్లకి ఆ పేర్లు పెట్టింది కూడా ఆ 'మాటగాళ్లే'.. ఒకప్పటి ఆటగాళ్లు.. మైక్రోఫోన్ పట్టి కామెంటేటర్లుగా కొత్త అవతారమెత్తుతున్న సీనియర్ క్రికెటర్లు.
-------------------
'వావ్... వాట్ ఎ షాట్ !'
'ఇన్ ది ఎయిర్... అండ్ ఈజ్ టేకెన్'
'ఫౌండ్ ద గ్యాప్...క్లియర్స్ ద రోప్'
'గాన్ ఓవర్ ద టాప్... అండ్ ఇట్స్ ఎ సిక్స్'
ఈ డైలాగులేవీ లేని క్రికెట్ మ్యాచ్ చూడడం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సచిన్ క్రీజ్‌లో బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తున్నా, సెహ్వాగ్ ధాటికి ప్రతి బంతి బౌండరీలైన్ దాటుతున్నా... కనిపించే దృశ్యానికి తోడు వినసొంపైన కామెంటరీ లేకుండా క్రికెట్ చూడగలమా..? మూకీ సినిమా చూసినట్టు ఉండదూ ! అందుకే కామెంటరీ అంత ప్రాధాన్యత సంతరించుకొంది. అదే హర్షభోగ్లేని హీరోని చేసింది. రిటైరైన ఆటగాళ్లను మళ్లీ క్రికెట్‌కి దగ్గర చేస్తోంది. అలాంటి వారిలో కొందరు ప్రపంచ క్రికెట్‌లోనే మేటి కామెంటేటర్లుగా ఎదిగారు. టోనీ గ్రెయిగ్, జెఫ్రీ బాయ్‌కాట్ లాంటి మాజీ ఇంగ్లీష్ క్రికెటర్లు నేటి తరానికి మేటి కామెంటేటర్లుగా మాత్రమే తెలుసు. కాస్త వెనక్కెళ్తే... ఆస్ట్రేలియన్ మాజీ టెస్ట్ క్రికెటర్ రిచీ బెనాడ్‌ని 'మాస్టర్ ఆఫ్ మైక్రోఫోన్' అని పిలుస్తారు. ఆయనే మేటి కామెంటేటర్ ఇప్పటికీ.

నలభయ్యేళ్లకు పైగా రేడియో, టీవీ కామెంటేటర్‌గా పని చేసిన రిచీ బెనాడ్ కామెంటేటర్ వృత్తికే గౌరవాన్ని తీసుకొచ్చాడు. మేటి కామెంటేటర్ అవుతాడని ముందే గ్రహించాడో ఏమో 26 ఏళ్ల వయసులోనే.. మేటి ఆల్‌రౌండర్‌గా క్రికెట్ జట్టులో సుస్థిర స్థానం ఉండగానే బీబీసీ రేడియో ప్రెజెంటర్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఓ వైపు క్రికెట్ ఆడుతూనే మరోవైపు వేరే జట్లు ఆడే మ్యాచ్‌లకు రేడియో కామెంటేటర్‌గా పని చేసేవాడు. తర్వాత ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా ఎన్నికై ఆరేళ్లపాటు ఆ బాధ్యతలు నిర్వహించి 1964లో రిటైర్ అయ్యాడు. తర్వాత తన పూర్తి సమయాన్ని కామెంటరీకే కేటాయించాడు. టీవీ రంగప్రవేశం చేయడంతో రేడియోని వదిలి టీవీ కామెంటేటర్‌గా మారాడు. 2009 దాకా టీవీ కామెంటేటర్‌గా పని చేసిన ఆయన వయసు అప్పటికి ఎనభయ్యేళ్లు. ఆయన తర్వాత ఎంతోమంది కామెంటేటర్లు వచ్చినా అంతర్జాతీయంగా అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించింది మాత్రం ఇంగ్లీష్ క్రికెటర్లయిన జెఫ్రీ బాయ్‌కాట్, టోనీ గ్రెగ్‌లే.

ఆరడుగుల ఆరంగుళాల ఎత్తుండే ఇంగ్లీష్ మాజీ ఆల్‌రౌండర్ టోనీ గ్రెయిగ్ కామెంటరీ స్టయిల్‌ని మనదేశ కామెంటేటర్లతో పాటు చాలామంది కామెంటేటర్లు అనుకరిస్తారు. జెఫ్రీ బాయ్‌కాట్ ఇంగ్లండ్ మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. మేటి కామెంటేటర్‌గా ఎదిగిన జెఫ్రీకి గొంతు క్యాన్సర్ ఉందని తెలిసినపుడు ఎందరో క్రికెట్ ప్రేమికులు విచారించారు. అయితే జెఫ్రీకి క్యాన్సర్ నయమై మళ్లీ కామెంటరీ బాక్స్‌లో ఎంటరై మైక్రోఫోన్ చేపట్టాడు. పిచ్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు తాళంచెవితో పిచ్‌పై గుచ్చుతూ పిచ్ స్వభావాన్ని వివరించే విధానానికి ఆద్యుడు ఆయనే. తర్వాత చాలామంది కామెంటేటర్లు అదే పని చేశారు (అయితే ఆ తర్వాత ఐసిసి అలా తాళంచెవి గుచ్చడాన్ని నిషేధించింది). వీళ్లిద్దరు చేసిన కామెంట్లు కొన్ని సార్లు వివాదాస్పదం కూడా అయ్యాయి. అయినా వారికున్న క్రేజ్ ముందు ఆ వివాదాలేవీ నిలవలేదు.

మన దేశానికి చెందిన చాలామంది మాజీలు కామెంటరీ బాక్స్‌లో అడుగుపెట్టినా రవిశాస్త్రి వారిలో మేటి కామెంటేటర్‌గా ఎదిగాడు. హర్ష భోగ్లే గురించి వేరే చెప్పనవసరం లేదు. ఉస్మానియా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చదివి, ఐఐఎమ్ అహ్మదాబాద్ నుంచి మేనేజ్‌మెంట్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ హైదరాబాదీ ఆ తర్వాత క్రికెట్ కామెంటేటర్ అవతారమెత్తాడు.
క్రికెట్ స్టేడియంలో ఓ మూల ఉన్న అద్దాల గదిలో నుండి మైక్రోఫోన్లో గుక్క తిప్పుకోకుండా మాట్లాడే కామెంటేటర్లు మధ్యమధ్యలో ఆటగాళ్లపై కామెంట్లు, చలోక్తులు విసురుతుంటారు.

వారి తప్పుల్ని ఎత్తి చూపుతుంటారు. క్రీజ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ వీర బాదుణ్ణి, నిప్పులు చెరిగేలా బంతులు విసురుతున్న బౌలర్‌ని, బుల్లెట్‌లా దూసుకుపోతున్న బంతిని మిల్లీ సెకన్లలో అందుకుని.. విజయ గర్వంతో పరుగుతీసే ఫీల్డర్ గురించి ఎంత బాగా వర్ణిస్తారు వాళ్లు! అక్కడితో ఆగిపోరు వాళ్లు, కాలమిస్టులుగా పత్రికల్లో రాస్తూ క్రికెట్‌ని అటు ప్రేక్షకులకి, ఇటు పాఠకులకి మరింత దగ్గర చేస్తారు. రేడియో కామెంటరీ విషయానికి వస్తే... సురేష్ సరయ్యా 40 ఏళ్ల పాటు ఆకాశవాణిలో కామెంటేటర్‌గా పనిచేశారు. దాదాపు 150 వన్డేలకు, నాలుగు ప్రపంచకప్ ఫైనల్స్‌కు కామెంటరీ చెప్పారు. ఆకాశవాణిలోనే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు చెందిన పలు రేడియో స్టేషన్లకు కూడా కామెంటేటర్‌గా పనిచేశారు.

ఫార్మాట్‌కి తగ్గట్టుగానే కామెంటరీ

ఒకో కామెంటేటర్ ఒకో రకంగా మాట్లాడతాడు... విషయ పరిజ్ఞానం, విశ్లేషించే గుణం...వీటికి తోడు వాక్చాతుర్యం కలిస్తేనే కామెంటేటర్. అంతే కాదు టెస్ట్ క్రికెట్, వన్డే, టి-20 మూడింటిలో ఒక్కో ఫార్మాట్‌కీ ఒకో రకంగా కామెంటరీ చెబుతారు. ఐదురోజుల పాటు సాగే టెస్ట్ మ్యాచ్‌కి తగ్గట్టుగానే కామెంటరీ కూడా నిదానంగా ఉంటుంది. కామెంటేటర్ల మాటల్లో విశ్లేషణ ఎక్కువగా ఉంటుంది. ఆటగాళ్ల గురించి, జట్ల గురించి ఇద్దరు కామెంటేటర్లు ఒకరితో ఒకరు ముచ్చటించుకున్నట్టుగా ఉంటుంది. అంతేకాని ప్రేక్షకులతో చెప్పినట్లు ఉండదు.

అదే వన్డే మ్యాచ్‌లో ఐతే జట్ల బలాబలాల గురించిన చర్చ కాస్త వాడిగా ఉంటుంది. కామెంటేటర్లు ఒకరితో ఒకరికన్నా ప్రేక్షకులకు చెప్పడం ఎక్కువవుతుంది. ఇక టి-20లో అయితే స్కోర్‌బోర్డ్ ఎంత వేగంగా పరుగెడుతుందో అంతే వేగంగా కామెంటరీ కూడా దూసుకెళ్తుంది. మరోవైపు స్పోర్ట్స్ చానళ్లు కూడా పెరిగాయి. అంతర్జాతీయ టోర్నీలతో పాటు ఇప్పుడు ఐపిఎల్ రాకతో క్రికెట్‌కి మరింత క్రేజ్ పెరిగింది. దానితోపాటు స్టార్ క్రికెట్, నియో క్రికెట్, టెన్ క్రికెట్... ఇలా క్రికెట్‌కే ప్రత్యేకంగా చానళ్లు పుట్టుకొచ్చాయి. వాటిలో ఇరవై నాలుగ్గంటలూ క్రికెట్టే. క్రికెట్ ప్రోగ్రాములు, క్రికెట్ క్విజ్‌లు, చర్చలు, విశ్లేషణలు పెరిగిపోయాయి. అందుకే కామెంటేటర్లు ఆ చానళ్లలో ప్రజెంటర్లుగా కొత్త అవతారమెత్తుతున్నారు.

నెంబర్‌వన్ కామెంటేటర్ ఎవరు?

నెంబర్‌వన్ బ్యాట్స్‌మన్ ఎవరు నెంబర్‌వన్ బౌలర్ ఎవరు అని అడిగితే చటుక్కున సమాధానం చెప్పేస్తాం. బెస్ట్ అంపైర్ ఎవరు అని అడిగితే సైమన్ టౌఫెల్ అనో మరొకరనో చెప్పేస్తాం. అయితే ఎవరు బెస్ట్ కామెంటేటర్ అని అడిగితే ఎవరి పేరు చెప్పాలి? అందుకే క్రిక్ఇన్‌ఫోడాట్‌కామ్ ఆన్‌లైన్ ఓటింగ్ నిర్వహించింది. దాని ఆధారంగా టాప్‌టెన్ కామెంటేటర్లను ప్రకటించింది. దాన్లో మొదటి స్థానంలో నిలిచాడు హర్ష భోగ్లే. ఆ తర్వాతి స్థానాన్ని రవిశాస్త్రి, ఆక్రమించాడు. మిగతా స్థానాల్లో రిచీ బెనాడ్, టోనీ గ్రెగ్, జెఫ్రీ బాయ్‌కాట్, ఇయాన్ చాపెల్, మైకెల్ హోల్డింగ్, డేవిడ్ లాయిడ్, సునీల్ గవాస్కర్, రమీజ్ రాజా నిలిచారు.

అయితే 'మోస్ట్ ఎంటర్‌టైనింగ్' క్యాటగిరీలో టోనీ గ్రెయిగ్... జెఫ్రీ బాయ్‌కాట్ కంటే మూడు ఓట్లు ఎక్కువ తెచ్చుకుని నెంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించాడు. డేవిడ్ లాయిడ్ నంబర్ త్రీతో సరిపెట్టుకుంటే మన భోగ్లే నాలుగో స్థానంలో నిలిచాడు. అంపైర్ల లాగే కామెంటేటర్లు కూడా ఆడే రెండు జట్లలో ఏ ఒక్క దానివైపు పక్షపాతం చూపకూడదు. అలాంటి కామెంటేటర్లనే అందరూ గౌరవిస్తారు. ఈ సర్వేలో 'మోస్ట్ అన్‌బయాస్డ్' కామెంటేటర్‌గా రిచీ బెనాడ్ ఎన్నికయ్యాడు. హర్ష భోగ్లే రెండో స్థానంలో, రవిశాస్త్రి మూడో స్థానంలో నిలిచారు.

కామెంటరీ రైటర్లు

రేడియోలు, టీవీ చానళ్లే కాదు, మేం కూడా లైవ్ కామెంటరీ అందిస్తున్నాం అంటున్నాయి క్రికెట్ వెబ్‌సైట్లు. అయితే వాళ్ల కామెంటరీని చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కంప్యూటర్ కామెంటేటర్లు చెప్పరు.. రాస్తారు. ఆఫీసుల్లో పని చేస్తూ టీవీ కాని రేడియో కాని అందుబాటులో లేని క్రికెట్ అభిమానులు ఈ కామెంటరీ చదువుకుని సంతోషిస్తారు. బంతిని బౌలర్ ఎంత వేగంతో విసిరాడు... దాన్ని బ్యాట్స్‌మన్ ఎలా షాట్ కొట్టాడు. ఎటువైపుగా బౌండరీకి తరలించాడు లాంటి విషయాల్ని క్షణాల్లో రాసేస్తారు వాళ్లు.

- నాగేశ్వరరావు తమనం

అమెరికన్ గాడ్స్‌కి 'అక్కలా'భరణాలు

'మీరెక్కడుంటారు' అమెరికా నుంచి వచ్చిన ఓ యువకుణ్ణి అడిగాడో పెద్దమనిషి.
'అమెరికాలో లెండి' అని 'అది మీకు తెలిసిన చోటు కాదన్నట్టు'గా బదులిచ్చాడా యువకుడు.
'అమెరికాలో ఎక్కడ?' అడిగాడా పెద్దమనిషి.
'చికాగోలో' చెప్పాడు యువకుడు.
'చికాగోలో ఉన్న అరోరా టెంపుల్‌కి వెళ్లారా' అడిగాడు పెద్దాయన.
'వెళ్లాను..! మీరు కూడా అమెరికాలోనే ఉంటారా ?' అన్నాడా యువకుడు ఆశ్చర్యంగా.
'అదేం లేదు.. ఆ గుడిలో దేవుడికి బంగారు ఆభరణాలు తయారు చేసింది నేనే!' చెప్పాడా పెద్దమనిషి.
అప్పుడు కాని అర్థం కాలేదు 'అమెరికన్ యూత్'కి పెద్దాయన ఎందుకు అడుగుతున్నాడో. ఆయనే తెనాలికి చెందిన శిల్పి అక్కల రామకృష్ణ. ఆయనొక్కడే కాదు. వాళ్లు నలుగురు సోదరులు. అందరూ శిల్పులే. అమెరికాలో ఇంకా ఏయే దేవాలయాలకి ఆభరణాలు చేశారు? అని అడిగితే... ఆ జాబితా విప్పడం కాస్త కష్టం కాని మీరే ఏదైనా ప్రాంతం పేరు చెప్పండి అక్కడున్న ఏ గుడిలో ఏ దేవుడికి ఏ ఆభరణాలు చేశామో చెబుతాం అంటారు వాళ్లు. దాని అర్థం - అమెరికాలో మన దేవుళ్లందరూ అక్కల వారి ఆభరణాలే ధరిస్తున్నారని.
--------------
మనకైతే బంగారు నగలు కొనుక్కోవడానికి పెద్దపెద్ద నగల దుకాణాలుంటాయి. బంగారు కాంతులు, విద్యుద్దీపాల వెలుగులు కలిసి ధగధగ మెరిసిపోయే అద్దాల షోరూంలు అన్నిచోట్లా వెలిశాయి. ఆ షోరూంలకి వెళ్తే చాలు, వందల డిజైన్లు, వేల రకాల నగలు... మరి దేవుళ్లకు నగలు చేయించాలంటేనో... వాటినెవరు తయారు చేస్తారు? అవి కూడా రెడీమేడ్‌గా దొరుకుతాయా అంటే అస్సలు దొరకవు. ఎందుకంటే వాటిని తయారు చేసేది మామూలు బంగారు కొట్ల వాళ్లు కాదు. శిల్పశాస్త్రం తెలిసిన బంగరు శిల్పులు. అలాంటి వాళ్లే 'అక్కల' అన్నదమ్ములు. మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కొన్ని వేల దేవాలయాల్లో ఉన్న దేవతా మూర్తుల విగ్రహాలు 'అక్కల' అన్నదమ్ములు చెక్కినవే.

ఆ దేవతామూర్తులను అలంకరించిన ఆభరణాలు కూడా వాళ్లు చేసినవే. విజయవాడ కనకదుర్గకి, నిడదవోలు కోట సత్యమ్మకి బంగారు కిరీటాలు, సింహాచలం నరసింహస్వామికి, వరాహస్వామికి బంగారు కవచాలు, అన్నవరం ఆలయంలో వెండి, పంచలోహ విగ్రహాలు, వాటికి వెండి ఆభరణాలు. నెల్లూరు ఇరుకళల పరమేశ్వరీదేవికి బంగారు కిరీటం, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామికి బంగారు కిరీటం...ఇలా చాలా దేవుళ్ల మెరిసిపోయే కాంతుల వెనక ఉంది వీరి చేతులే. తెలుగునాటే కాదు, మధ్యప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా చాలా ఆలయాలకిఆభరణాలు చేశారు 'అక్కల' సోదరులు. హరిద్వార్‌లో వెంకటేశ్వరస్వామి ధరించిన ఆభరణాలూ వీళ్లే చేశారు.

ఆ నలుగురు...


అక్కల కుటుంబం అరవయ్యేళ్లుగా తెనాలిలో విగ్రహాల తయారీ వృత్తిలో ఉంది. ఆ కుటుంబంలో మూడు తరాల నుండి ఇదే పని చేస్తున్నారు. మొదటి తరం శిల్పి అక్కల రామయ్య తెనాలిలో శిల్పశాలను స్థాపిస్తే ఆయన నలుగురు కొడుకులూ తండ్రి బాటలోనే నడిచారు. వాళ్లే అక్కల మంగయ్య, రామకృష్ణ, రామ మోహన్, శ్రీరాం. వంశపారంపర్యంగా నేర్చుకున్నా తమిళనాడు ప్రభుత్వం శిల్పకళలో నిర్వహించే పరీక్షలో కూడా ఉత్తీర్ణులయ్యారు. మంగయ్య కుమారులు రామలింగేశ్వర కుమార్, రమేష్ కూడా ఇదే వృత్తిని చేపట్టారు. ఈ అరవయ్యేళ్లలో శిల్పకళలో వచ్చిన మార్పులకు అనుగుణంగా కొత్తకొత్త పద్ధతులు నేర్చుకుంటూ, నల్లరాతి నుంచి ఫైబర్ విగ్రహాల వరకూ రకరకాలు తయారు చేస్తున్నారు అక్కల బ్రదర్స్. మూడు తరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నాం కాబట్టి మాకు ఎక్కడెక్కడి నుంచో విగ్రహాలు, ఆభరణాలు చేయమని ఆర్డర్లు వస్తుంటాయని చెప్పారు రామకృష్ణ.

అమెరికా దాకా...

అక్కల సోదరుల కీర్తి వ్యాపించాక 1990లో మొదటిసారి అమెరికా ఆఫర్ వచ్చింది. "అమెరికాలోని లివర్‌మోర్‌లో ఉన్న 'శివా విష్ణు టెంపుల్' వాళ్లు నవరత్నఖచిత వజ్ర కిరీటం తయారు చేయమన్నారు. ఆ గుడిని కట్టించింది తెలుగువాళ్లే. అలా ఆ గుడిలోని వెంకటేశ్వర స్వామికి కిరీటం తయారు చేయడంతో అమెరికా ఆఫర్లు మొదలయ్యాయి. తర్వాత 1992లో టెక్సాస్‌లోని వెంకటేశ్వర స్వామికి కిరీటాన్ని తయారు చేశాం. అప్పట్లో అమెరికాలో ఉన్న గుళ్లన్నీ చిన్నచిన్న మందిరాల్లా ఉండేవి. నగరాల శివారుల్లో ఉండే ఆ మందిరాల్లో దేవుళ్ల ఫోటోలే ఉండేవి. ఏవో కొన్నిట్లో మాత్రమే చిన్నచిన్న విగ్రహాలుండేవి.

1994లో మిసిసిపీ రాష్ట్రం జాక్సన్‌లో మనవాళ్లు దేవాలయం నిర్మిస్తూ ఆ దేవాలయానికి విగ్రహాలు, ఆభరణాలు తయారు చేయటానికి మమ్మల్ని అమెరికాకి ఆహ్వానించారు. అచ్చం తిరుమలలో ఉన్నట్టే కావాలన్నారు. అలా నేను, మా బాబాయి రామకృష్ణ రెండేళ్లపాటు అమెరికాలో ఉండి ఆ గుడికి కావాల్సిన వెండి, బంగారు, పంచలోహ విగ్రహాలు, ఆభరణాలు తయారు చేశాం'' అంటూ వివరించాడు మంగయ్య కుమారుడు రామలింగేశ్వర కుమార్. ఆ సమయంలోనే అమెరికాలో ఉన్న చాలా ఆలయాలకి కూడా ఆభరణాలు చేయమని అక్కల సోదరులని అడిగారు అక్కడి మనవాళ్లు.


అలా ఒక్క గుడితో మొదలై మిసిసిపీలోని వెంకటేశ్వర స్వామికి, అట్లాంటాలోని మరో ఆలయానికి, హూస్టన్ శ్రీమీనాక్షి టెంపుల్ లోని వాసవీ కన్యకా పరమేశ్వరికి బంగారు కవచాలు, సర్వాభరణాలు తయారు చేశారు. "అమెరికాలో మేం చేసిన విగ్రహాలు, ఆభరణాలతో ఒక ఎగ్జిబిషన్ నిర్వహించాం. ఆ ఎగ్జిబిషన్‌కి మన భారతీయులతో పాటు అమెరికన్ శిల్పులు కూడా వచ్చారు. వారికి మన శిల్పకళ గురించి వివరించాం. వారి వద్ద నుంచి కూడా చాలా నేర్చుకున్నాం. అక్కడి శిల్పులు ఉపయోగిస్తున్న ఆధునిక టెక్నాలజీ గురించి, దాన్ని మన శిల్పకళలో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో కూడా తెలుసుకున్నాం. అమెరికన్లు, అక్కడున్న మనవాళ్లూ క్వాలిటీ విషయంలో రాజీ పడరు. అక్కడ చెప్పిన టైంకి పని పూర్తవ్వాలి.

క్వాలిటీ బాగుండాలి. అవి రెండూ పాటించాం కాబట్టే మేం అమెరికాలో ఉన్న మన దేవాలయాలకి అన్ని ఆభరణాలు చేయగలిగాం. అప్పట్లో హిందూ దేవాలయాలు, మందిరాలు, జైనుల మందిరాలు మొత్తం కలిపి అమెరికాలో 100 నుంచి 120లోపు ఉండేవి. రానురాను దేవాలయాలు పెరిగాయి. మాకు ఆర్డర్లు కూడా పెరిగాయి. అక్కడున్న ఆలయం మొత్తాన్ని ఒకే సారి నిర్మించరు. దాతల విరాళాలను బట్టి కొత్త ఆభరణాలు ఒకటొకటిగా చేయిస్తూ ఉంటారు'' అన్నాడు రామలింగేశ్వర్ కుమార్. దేవుడికి ఆభరణాలు చేయాలంటే ముందుగా అమెరికా వెళ్లి ఆ విగ్రహాల కొలతలు తీసుకొని వస్తారు వాళ్లు. కావాల్సిన బంగారాన్ని, మిగతా వస్తువులను దేవాలయాల నిర్వాహకులే శిల్పులకి ఇస్తారు. తయారు చేసిన ఆభరణాల్ని నిర్వాహకులే తెనాలి వచ్చి తీసుకెళ్తారు. ఒక్కోసారి అక్కల సోదరులే అమెరికా వెళ్లి వాటిని విగ్రహాలకు అమర్చి వస్తారు. 2009లో క్యారీలోని వెంకటేశ్వర స్వామికి ఆభరణాలు చేసి తీసుకెళ్లి అమర్చి వచ్చారు అక్కల రామకృష్ణ.

అమెరికా నుంచి అక్కల శిల్పుల ప్రతిభ ఆఫ్రికాలో ఉన్న మనవాళ్లకి కూడా తెలిసింది. నైజీరియాలోని హిందూ ఆలయానికి ఆభరణాలు చేసింది అక్కల సోదరులే. కెన్యా రాజధాని నైరోబీలోని వెంకటేశ్వర స్వామికి బంగారు కిరీటం, హస్తాలు కూడా వాళ్లే చేశారు. ఐర్లాండ్‌లోని వినాయకుడి గుడికి విగ్రహాన్ని, ఆభరణాల్ని, మారిషస్‌లోని లక్ష్మీనారాయణ స్వామికి, రామాలయాలకి బంగారు ఆభరణాల్ని చేశారు.

విదేశాలకోసం ఫైబర్ విగ్రహాలు

విదేశీ ఆలయాల కోసం ఈ మధ్య దేవతల విగ్రహాలను, వాహనాలను ఫైబర్‌తో తయారు చేస్తున్నారు. దేవతల విగ్రహాలు ఫైబర్‌తో మొదటిసారి చేసింది మేమే అంటారు ఈ శిల్పులు. "ఫైబర్ విగ్రహాలయితే విదేశాలకి తీసుకెళ్లడానికి తేలికగా ఉంటాయి. ఆ విగ్రహాల్ని సులువుగా శుభ్రం చేయొచ్చు. అందుకే 'ఈజీ టు క్యారీ, ఈజీ టు క్లీన్'గా ఉండాలని దేవతా విగ్రహాలన్నీ ఫైబర్‌తో చేస్తున్నాము. వాటితో మనం అనుకున్న శరీర ఆకృతిని, రూపురేఖల్ని కూడా తీసుకురావచ్చు. ఫైబర్‌తో వచ్చినంత అందంగా మెటల్‌తో కూడా రావు. విదేశాల్లోని మనవాళ్లు ఫైబర్‌తో చేసిన వాటినే ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గజవాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనాలు ఈ మధ్యే అమెరికాకి పంపించాం'' అని ఫైబర్ దేవుళ్ల గురించి చెప్పారు రామకృష్ణ. ఎన్ని విగ్రహాలు చేసినా, ఆభరణాలు చేసినా అక్కల సోదరులు చెప్పేది మాత్రం ఒక్కటే... మేం చేసిన పని చూసి ముందు మేం సంతృప్తి చెందాలి.

ఆ తర్వాత కస్టమర్ సంతృప్తి చెందాలి. అది చేయగలుగుతున్నాం కాబట్టే మేం ఇన్నేళ్లుగా రాణిస్తున్నాం అంటారు.వీరి ప్రావీణ్యం దేవతల విగ్రహాలు, ఆభరణాలకే పరిమితం కాలేదు. నేతల విగ్రహాలు చేయడంలో కూడా అక్కల బ్రదర్స్ ముందున్నారు. నేతల విగ్రహాలు తయారు చేయమని రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతో మంది వస్తుంటారు. "ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న నీలం సంజీవరెడ్డి విగ్రహం, రామంతపూర్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహం, సంజీవరెడ్డినగర్ సిగ్నల్ వద్ద ఉన్న ఉమేష్ చంద్ర విగ్రహం, విశాఖ సముద్ర తీరాన ఉన్న శ్రీశ్రీ విగ్రహం మేం చేసినవే. మద్రాస్‌లో పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసిన ప్రదేశంలో ప్రతిష్టించిన ఆయన విగ్రహం కూడా మేమే చేశాం. తెనాలి మునిసిపాలిటీ శతాబ్ది వేడుకల సందర్భంగా ప్రతిష్టించిన 'తెనాలి రామకృష్ణ' విగ్రహమూ మేం చేసినదే'' అన్నారు రామకృష్ణ.

- నాగేశ్వరరావు తమనం