ఏపుగా పెరిగి.. విరక్కాసిన పైరును చూసుకుని కళ్లతోటే కడుపులు నింపుకుంటారు రైతులు.
'ఏ ఊరి విత్తనం వేశావ్' అని ఆశ్చర్యంగా అడిగేస్తారు ఆ కాపు చూసిన తోటి రైతులు.
అంతటితో ఆగకుండా, 'విత్తనాలకి వదిలిపెడుతున్నావా, మొత్తం కాయల్ని కోసేస్తున్నావా' అని అడుగుతారు వాళ్లలో కొందరు. అది వాళ్లకెందుకు?
ఎందుకంటే... వచ్చే ఏడాది ఆ పంటనుంచి తీసిన విత్తనాల్నే తమ చేలల్లో కూడా విత్తుకుందామని.
పంటలు అన్ని గ్రామాల్లోనూ పండిస్తున్నా ఆ పంట విత్తనాన్ని పండించేది మాత్రం కొన్ని గ్రామాల్లోనే. అదే ఆ గ్రామాల ప్రత్యేకత. కాబట్టే ఆ గ్రామాల వాళ్లే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల రైతులందరూ కూడా ఆ ఊళ్ల విత్తనాల్నే విత్తుతారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల విత్తనాల్ని కాదని ఈ రైతుల్నే ఆశ్రయిస్తారు. అలాంటి 'విత్తనాల గ్రామాలు' మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా కూరగాయలు పండే ప్రాంతాల్లోఏదో ఒక విత్తనాల గ్రామం తప్పక ఉంటుంది. సాగులో విత్తనాల సాగు వేరయా అంటున్న విత్తనాల గ్రామాల విశేషాలే ఈ వారం కవర్ స్టోరీ!
-----------------------

గుంటూరు జిల్లాలోని మామిళ్లపల్లి, ఎర్రబాలెం గ్రామాలది ఓ ప్రత్యేక అనుబంధం. అలాగని ఆ రెండు ఊళ్లు పక్కపక్కనే ఉండవు. మామిళ్లపల్లి పొన్నూరు మండలంలో ఉంటే ఎర్రబాలెం మంగళగిరి మండలంలో ఉంటుంది. వాటి మధ్య దూరం యాభై కిలోమీటర్ల పైనే ఉంటుంది. రెండు ఊళ్ల మధ్య చుట్టరికం కూడా లేదు. అయినా ఆ రెండు గ్రామాల బంధం ఇచ్చిపుచ్చుకునేదే. అదే విత్తనాలు ఇచ్చిపుచ్చుకునే బంధం. ఊరికే ఏమీ కాదులెండి డబ్బుకే. ఎర్రబాలెం బీర విత్తనాలు మా ఊళ్లో విరగ్గాస్తాయని మామిళ్లపల్లి రైతులు అంటే మామిళ్లపల్లి విత్తనానికి తిరుగు లేదని ఎర్రబాలెం వాళ్లంటారు.
ఆ రెండు ఊళ్లలోని నేల తీరే అంత... అందుకే ఆ పొలాల్లో తీసిన విత్తనానికి అంత గిరాకీ అని చుట్టుపక్కల గ్రామాల వాళ్లంటారు. గుంటూరు జిల్లాలో బీరకాయ చాలా ఊళ్లలో పండిస్తున్నా విత్తనాలు సాగు చేసేది మాత్రం ఈ రెండు గ్రామాల్లోనే. అందుకే ఏ ఊరి బీర రైతుని అడిగినా ఆ రెండు గ్రామాల విత్తనాల గురించి, ఆ కాయల సైజు గురించి, నాణ్యత గురించి తెగ పొగిడేస్తాడు. కేవలం గుంటూరు జిల్లాలోనే కాదు అటు కృష్ణా జిల్లా, ఇటు ప్రకాశం జిల్లా రైతులు కూడా తొలకరి వచ్చిందంటే సంచులు తీసుకొని ఆ ఊళ్లొచ్చేస్తారు. ఆ రెండు గ్రామాల రైతులు బీరకాయలమ్మి ఎంత సంపాదిస్తారో విత్తనాలు అమ్మి కూడా అంత సంపాదిస్తారు.
ఈ రెండు గ్రామాల్లాంటిదే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడ. అది కూడా బీర విత్తనాల గ్రామమే. ఆ ఊరి బీరని 'ఏడు ఆకుల బీర' అని పిలుస్తారు. గత యాభయ్యేళ్లుగా అక్కడ బీర విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విత్తనాలు కొనడానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుండి కూడా రైతులు వస్తుంటారు. అంతేకాదు విదేశాల్లో ఉండే తెలుగువాళ్లు కూడా చిత్రాడ బీరకాయలంటే మోజుతో ఇక్కణ్ణుంచి విత్తనాలు పంపమని అడుగుతుంటారట. అందుకే గత మూడేళ్లుగా చిత్రాడ బీర విత్తనాలు విదేశాలకి కూడా తరలి వెళ్తున్నాయి.
ఈ మూడు గ్రామాల విత్తనాలకి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, రైతులెవ్వరూ కాయల్నుంచి విత్తనాలు తీసి నిల్వ ఉంచరు. కాయల్నే నిల్వ ఉంచుతారు. విత్తనాలు కావాల్సిన వాళ్లు వచ్చినపుడు వారిముందే కాయలనుంచి విత్తనాలు కార్చి ఇచ్చేస్తారు. విత్తనాలు ముందే కార్చేస్తే ఆ కాయల సైజు, వాటి నాణ్యత గురించి కొనే వాళ్లకి తెలీదు. అందుకే కాయల్ని చూసి విత్తనాలు కొనాలంటారు రైతులు. ఈ అవకాశం విత్తన దుకాణాల్లో ఉండదు.
విత్తనాలకి మెట్టపైరే!
బీర అన్ని కాలాల్లోనూ అన్ని నేలల్లోనూ పండే పంట. మాగాణిలో అయినా పండుతుంది. మెట్టలో అయినా పండుతుంది. తొలకరి పంటను మే, జూన్ నెలల్లోనూ రెండవ పంటను ఆగస్టు, సెప్టెంబరు నెలల్లోనూ వేస్తే మూడవ పంటను జనవరి, ఫిబ్రవరిలలో వేస్తారు. సాగు నీరు లభ్యమయ్యే ప్రాంతాల్లో వరి కోతలయ్యాక మాగాణి నేలల్లో బీర వేస్తారు. మూడు పంటలు పండినా రెండవ, మూడవ పంటల్నుండి మాత్రమే... అది కూడా మెట్ట పొలంలో పండే పంట నుంచి మాత్రమే విత్తనాలు తీస్తారు. ఆ పంటల్ని పైర బీరలు అని అంటారు.
విత్తిన 35 రోజులకే బీరతోట కోతకు వస్తుంది. అప్పుడు మంచి సైజు ఉన్న కాయల్ని కోయకుండా విత్తనాలకు వదిలేస్తారు రైతులు. ఆ కాయలు బాగా ముదిరి, పండిన తర్వాత ఎండడం మొదలవుతుంది. అప్పుడు వాటిని కోసి పదిపదిహేను రోజులు ఎండబెడతారు. ఆ తర్వాత కాయల్ని ఇళ్లలోనూ, గొడ్ల చావిళ్లలోనూ నిల్వ ఉంచుతారు. అలా అది రెండు నెలల పాటు నిద్రావస్థలో వుంటుంది. ఎండిన వెంటనే చేలలో నాటినా మొలుస్తాయి కాని కాపు కాయవు. కనీసం ఐదు నెలలు నిల్వ ఉన్న విత్తనాలను నాటితేనే ఫలితం బాగుంటుంది. కాయల్ని నిల్వ ఉంచే సమయంలో వాటికి పొగ తగలకుండా, మిరపకాయల పొగరు తగలకుండా జాగ్రత్తపడాలి. అదే జరిగితే విత్తనాలు మొలకెత్తవు. ఈ కాయలకి ఎలుకల బెడద కూడా ఎక్కువే.
ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి ఈ విత్తనాల రేటు కూడా కాస్త ఎక్కువే. గిరాకీని బట్టి మానిక విత్తనాల ధర రెండు వేల నుండి రెండువేల ఐదొందల దాకా ఉంటుంది. ఒకవేళ పచ్చి బీరకాయలకు గనక ధర ఎక్కువగా ఉంటే ఆ తర్వాత సంవత్సరం విత్తనాలకి డిమాండ్ మరీ ఎక్కువగా ఉంటుంది. విత్తనాల కోసం ఉంచే బదులు కాయల్ని కోసి అమ్ముకుంటే ఆ డబ్బులేవో ముందే వచ్చేస్తాయని అనుకుంటారు రైతులు. అయినా కొందరు మాత్రం అంతకన్నా ఎక్కువ డబ్బులొస్తాయని విత్తనాలకు వదిలేస్తారు. ఒక వేళ పచ్చి కూరగాయలకి ఎక్కువ ధర లేకపోతే మాత్రం చాలా మంది విత్తనాలకోసం వదిలేస్తారు. అప్పుడు విత్తనాల ధరలు కాస్త తగ్గుతాయి.
కాకుమాను గోరుచిక్కుడు
మామిళ్లపల్లి బీర రైతులందరికీ కాకుమాను గురించి తెలుసు. ఎందుకంటే మామిళ్లపల్లిలో బీరతోటలన్నీ అల్లుకునేది కాకుమాను చిక్కుడు చెట్లమీదే. ఎలాగంటే... ఏడాదికి మూడు పంటలు పండే మామిళ్లపల్లి భూముల్లో మొదటి పంటగా గోరుచిక్కుళ్లు వేస్తారు. ఆ విత్తనాల్ని కాకుమాను నుంచి తెస్తారు. చిక్కుడు పంట కాలం పూర్తయ్యేనాటికి ఆ చేలోనే బీర విత్తనాలు నాటుతారు. బీర తీగలు అల్లుకోవడానికి వీలుగా చిక్కుడు చెట్లను వంచి పందిరిలా చేస్తారు. తొలకరి వర్షాలు రాగానే మెట్ట ప్రాంతాల్లో కూరగాయల సాగు మొదలవుతుంది. ఆ సమయంలో గోరు చిక్కుడు ఎక్కువగా వేస్తారు. వారికోసమే అన్నట్టు కాకుమానులో గోరుచిక్కుడు విత్తనాల్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. బీరకాయల రైతుల్లా కాకుండా కేవలం విత్తనాల కోసమే వేల ఎకరాల్లో చిక్కుడు తోటలు వేస్తారు ఆ ఊళ్లో.గోరుచిక్కుడు విత్తనాల్ని అంత ఎక్కువగా ఉత్పత్తి చేసే ఊరు మరోటి మన రాష్ట్రంలోనే లేదంటారు వాళ్లు.
గత 30 ఏళ్లుగా కాకుమాను ప్రాంత రైతులు గోరుచిక్కుడును వాణిజ్య పంటగా పండిస్తున్నారు. పండించిన విత్తనాలను కృష్ణా, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంత రైతులకు, విత్తన వ్యాపారులకు కూడా అమ్ముతున్నారు. కాకుమానులో ఉండేది తెల్లమసక నేల, అది గోరుచిక్కుడు సాగుకు అనువుగా వుంటుందని రైతులు అంటారు. పైగా విత్తిన నాలుగు నెలల్లో విత్తనాలు చేతికొచ్చేస్తాయి. కాబట్టి ఆ చేలో మరో పంట వేసుకోవచ్చు. అంతే కాకుండా మిగతా మెట్ట పంటలతో పోలిస్తే చిక్కుడు సాగుకు ఖర్చు తక్కువ. అయితే దిగుబడి కూడా తక్కువే. ఎకరాకు 5 వేల రూపాయల పెట్టుబడి పెడితే మూడు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటా విత్తనాలు రూ. పది వేలు ధర చొప్పున ఎకరాకు రూ. 30 వేలు ఆదాయం వస్తుంది. అదే కిలోల చొప్పున రిటెయిల్గా అమ్ముకుంటే కిలో 150 రూపాయల రేటు వస్తుంది. అందుకే ఎక్కువ మంది రైతులు చిల్లరగానే విత్తనాల్ని అమ్ముతారు. ఈ విత్తనాల్ని చిక్కుళ్లను పండించడానికే కాకుండా నూలు తీయటానికి, జిగురు (గమ్ము) తయారీకి కూడా ఉపయోగిస్తారు.
పెదవడ్లపూడి కరివేపాకు విత్తనం
గుంటూరు జిల్లాలో మరో రెండు విత్తన గ్రామాలు కూడా ఉన్నాయి. అవే పెదవడ్లపూడి, అంగలకుదురు. నేడు రాష్ట్రంలో పెదవడ్లపూడి పేరు చెబితే 'కరివేపాకు' ఠక్కున గుర్తుకొస్తుంది. అంతకుముందు ఇళ్ల పెరళ్లలో మాత్రమే పెంచుకునే కరివేపాకు 'సాగు' రూపంలో దేశమంతా విస్తరించింది పెదవడ్లపూడి నుండే.
ఇదెలా సాధ్యమైందంటే... రకరకాల పూలు, పండ్ల మొక్కల నారు పెంచడం పెదవడ్లపూడిలో ఎప్పటినుంచో వస్తున్న వ్యాపార వ్యవసాయ విధానం. ఆ గ్రామ రైతులు నారింజ, కరివేపాకు, నిమ్మ, అశోక, జామ, సపోటా, మల్లె, జాజి, బంతి లాంటి చాలా రకాల మొక్కలను నారు పోసి అమ్ముతారు. సరిగ్గా 29 ఏళ్ల క్రితం ఆ మొక్కలతో పాటు కరివేపాకు నారు కూడా పోసి అమ్మకానికి ఉంచారు. అయితే ఆ నారు ఎవరూ కొనలేదు. దాంతో అది ఏపుగా పెరిగిపోయింది. అలా ఎదిగిన కరివేపాకును సమీపంలోని మంగళగిరి, తెనాలి, విజయవాడ, గుంటూరు మార్కెట్లకు తీసుకెళ్తే అది బాగా అమ్ముడుపోయి రైతులకు మంచి లాభం వచ్చింది. ఇదేదో బాగుందే అనుకున్న కొందరు రైతులు ఆ తరువాతి ఏడాది నుంచి కరివేపాకు సాగు చేయడం మొదలెట్టారు. అధిక లాభాలను ఆర్జించారు. అలా వడ్లపూడిలో కరివేపాకు సాగు వందల ఎకరాలకు విస్తరించింది.
కరివేపాకు తోటలను ఏడాదికి మూడు సార్లు కోస్తారు. ఎవరూ కాయలు కాసేదాకా ఉంచరు. కొందరు మాత్రమే విత్తనాల కోసం ఉంచుతారు. కాబట్టి విత్తనాల ఉత్పత్తి తక్కువ. అయినా పెదవడ్లపూడి నుండి కరివేపాకు ఎగుమతి కావడం మూలంగా అది విత్తనాలకు కూడా కేంద్రమైంది. పెదవడ్లపూడి చుట్టుపక్కల ప్రాంతాలలో పెంచే కరివేపాకు చెట్ల నుంచి తీసిన విత్తనాన్ని రైతులు పెదవడ్లపూడికి తీసుకువస్తారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, ఖమ్మం జిల్లా భద్రాచలం, కృష్ణాజిల్లా విస్సన్నపేట నుంచి కూడా రైతులు కరివేపాకు విత్తనాలు పెదవడ్లపూడికి తెస్తారు. ఏటా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఈ విత్తనాలు వస్తాయి. తెలంగాణలో మెదక్, జహీరాబాద్, రాయలసీమలో తాడిపత్రి ప్రాంతాల నుంచే కాకుండా పుణె నుంచి కూడా రైతులొచ్చి వడ్లపూడి కరివేపాకు విత్తనాలను కొనుక్కెళ్తూ ఉంటారు. ఆ మూడునెలల్లో 270 నుంచి 300 టన్నుల విత్తనాలను వడ్లపూడిలో అమ్ముతారు. ఆ విధంగా చుట్టుపక్కల గ్రామాల రైతులు తమ విత్తనాల్ని అమ్ముకునే కేంద్రంగా పెదవడ్లపూడి ఎదిగింది. ఎకరం పంట వేయడానికి 200 కిలోల నుంచి 300 కిలోల విత్తనం అవసరమవుతుంది. ధర కిలోకి 50 నుంచి 70 రూపాయలుంటుంది.
స్వయంగా విత్తనోత్పత్తి చేసి లాభాలు గడిస్తున్న గ్రామాల గురించి తెలుసుకున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ కంపెనీల కోసం విత్తనోత్పత్తి చేయమని రైతుల్ని ఆశ్రయించాయి. మామిళ్లపల్లినే తీసుకుంటే ఆ ఊళ్లో కూరగాయలతో పాటు మొక్కజొన్న కూడా ఎక్కువగా పండుతుంది. అందుకే పయనీర్ సంస్థ హైబ్రిడ్ విత్తనాలు తయారీ కోసం ఆ గ్రామ రైతుల్ని ఆశ్రయించింది. మార్కెట్లో లభించే ధరకన్నా ఎక్కువ చెల్లించి హైబ్రిడ్ విత్తనాలు ఉత్పత్తి చేయించింది.
ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ, జాతీయ విత్తన సంస్థలు కూడా ప్రతి జిల్లాలోనూ పంటలు బాగా పండే ప్రాంతాల్లో ఏటా రైతులకు విత్తనాలిచ్చి వారిచేత కొత్త వంగడాలు ఉత్పత్తి చేయిస్తున్నాయి. అయితే ఈ సంస్థలు కేవలం వరి, మినుము లాంటి ప్రధాన ఆహార పంట విత్తనాల ఉత్పత్తికే పరిమితమవుతున్నాయి. కూరగాయల విత్తనాల ఉత్పత్తి ఒకటి రెండు జిల్లాల్లో మాత్రమే, అది కూడా తక్కువ మొత్తంలో తప్ప చేయించడం లేదు. అందుకే దోస, బెండ, బీర లాంటి కూరగాయల విత్తనాలను ఇప్పటికీ రైతులే ఎక్కువగా ఉత్పత్తి చేసుకుంటున్నారు.
అంకాపూర్ జొన్నలు, సజ్జలు
పైన పేర్కొన్న గ్రామాల్లో రైతులు చేస్తున్న విత్తనోత్పత్తిని చూసి పెద్దపెద్ద సంస్థలే ఆ గ్రామా ల రైతుల్ని ఆశ్రయిస్తే అంకాపూర్లో దీనికి పూర్తిగా విరుద్ధంగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నియమ నిబంధనలతో విసిగిపోయిన రైతులు వాళ్లే స్వయంగా విత్తనాల్ని ఉత్పత్తి చేయడం మొదలెట్టారు.
మార్కెట్లో లభ్యమవుతున్న వెరైటీల్ని తెచ్చి వాటి నుంచి కొత్తకొత్త హైబ్రిడ్ రకాల్ని ఉత్పత్తి చేయడం, వాటికి కొత్త పేర్లు పెట్టి అమ్మడం అంకాపూర్ రైతులకు అలవాటే. జొన్న, సజ్జల్లో వేర్వేరు రకాల ఆడ, మగ విత్తనాల్ని తెచ్చి సంకరంచేసి కొత్త విత్తనాల్ని ఉత్పత్తి చేస్తారు. కొత్త వెరైటీలు తయారు చేయడానికి మీరేమైనా వ్యవసాయ శాస్త్రవేత్తలా అంటే... అవును మేం సర్టిఫికెట్లు లేని సైంటిస్టులం అని కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు వాళ్లు.
ఇదంతా ఎలా జరిగిందంటే... అంకాపూర్లో మొదటిసారి 1976లో 'నేషనల్ సీడ్ కార్పోరేషన్' వాళ్లు సజ్జ విత్తనాలు ఇచ్చి విత్తనోత్పత్తికి నాంది పలికారు. 1980లో ప్రైవేటు కంపెనీలు రంగ ప్రవేశం చేశాయి. పయనీర్ సీడ్స్ ఫౌండేషన్ ఎర్రజొన్న విత్తనాలు ఇచ్చి రైతుల చేత విత్తనోత్పత్తి చేయించడం మొదలుపెట్టింది. కంపెనీలు, రైతుల మధ్య ముందుగానే ఒప్పందం జరిగేది. పండించిన పంటకు ధర ఖరారు చేసుకున్న తర్వాత విత్తేవారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి ధర ఎక్కువగా ఉన్నా ఒప్పందం ధరకే విక్రయించాలి. కాని ధర తగ్గి ఆ వ్యాపారులు ఒప్పందం కంటే తక్కువ ధర ఇచ్చినా విత్తనాన్ని అదే వ్యాపారికి అమ్మాలి.
దాంతో రైతులు ఎవరితోనూ ఒప్పందం చేసుకోకుండా సొంతంగా విత్తుకుని ఎక్కువ ధర ఇచ్చిన వారికి నేరుగా అమ్మడం మొదలుపెట్టారు. అంతే కాదు, సంకర విత్తనాలు చేయడం నేర్చుకుని కొత్తకొత్త రకాల్నీ తయారు చేయడం మొదలుపెట్టారు. అంకాపూర్ విత్తనాలకి పేరు రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా దూర ప్రాంతాల రైతులు కూడా ఇక్కడికొచ్చి విత్తనాలు కొనుక్కెళ్తున్నారు. అలా అంకాపూర్ విత్తనాల గ్రామమైంది. ఇప్పుడు రైతులు పెద్దపెద్ద సీడ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని విత్తనాలను గ్రేడింగ్, ప్యాకింగ్ చేసి మరీ అమ్ముతున్నారు. ఇక్కడి ఎర్రజొన్నలు, సజ్జ విత్తనాలు ఉత్తరభారతదేశానికి కూడా ఎగుమతి అవుతాయి.
విత్తనోత్పత్తి పంటలు పరిచయం అయిన తర్వాత అంకాపూర్ ప్రాంత రైతుల దశ మారిపోయింది. ఈ పంటలతోనే రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించారు. వరి, మొక్కజొన్న, పసుపు పంటల వల్ల వరుసగా నాలుగైదేళ్ల పాటు నష్టపోయినా ఎర్రజొన్నలు, సజ్జల వల్ల మాత్రం ఎవరూ నష్టపోలేదు. ఆ పంటల వల్ల వచ్చిన నష్టాన్ని విత్తన పంటలు పూడ్చాయని అంటారు వాళ్లు.
కాశీపట్నం సేంద్రీయ వంకాయ
సేంద్రీయ ఎరువులతో సాగు చేసే కాశీపట్నం వంకాయకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో గిరాకీ బాగా ఎక్కువ. ఈ వంకాయల్ని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మార్కెట్లలో ప్రత్యేక కూరగాయగా అమ్ముతారు. గత సీజన్లో కాశీపట్నం వంకాయ కేజీ ఎనబై రూపాయల ధర పలికింది. అనంతగిరి మండలంలోని కాశీపట్నం, గరుగుబిల్లి, గుమ్మకోట, భీంపోలు, చిలకలగెడ్డ ప్రాంతాల్లో ఈ వంకాయ పండిస్తున్నా అన్నిట్నీ కాశీపట్నం వంకాయ గానే పిలుస్తారు. ఆ ప్రాంతాల్లోని గిరిజనులు సుమారు అయిదు వందల ఎకరాల్లో ఈ వంకాయల్ని పండిస్తారు.
ఏటా అక్టోబరు నెలలో కాపు మొదలయ్యే ఈ వంకాయలను కొనడానికి కాశీపట్నంలోనే ప్రతీ సోమ, బుధ, శనివారం ప్రత్యేక సంత జరుగుతుంది. వంకాయలకి గిరాకీ పెరగడంతో సహజంగానే వాటి విత్తనాలకీ గిరాకీ పెరిగింది. అందుకే వంగ రైతులు విత్తనాలు తీయడంపై ఇప్పుడు దృష్టి పెడుతున్నారు. పంటలో మంచి సైజున్న కాయల్ని విత్తనాల కోసం చెట్లకే వదిలేస్తున్నారు. ముదిరిన వంకాయల్నుంచి విత్తనాలు తీసి ఎండబెట్టి భద్రపరుస్తున్నారు. తర్వాతి సంవత్సరం ఆ విత్తనాలతో నారు పోసి పెరిగిన వంగ నారుని ఒక్కొక్క మొక్కను రెండు, మూడు రూపాయలకు అమ్ముతున్నారు. విశాఖ జిల్లాతోపాటు విజయనగరం జిల్లాల రైతులు కూడా ఈ మొక్కల్ని కొనుక్కెళ్లి తమ ప్రాంతాల్లో కూడా వంకాయని సాగు చేస్తున్నారు. ఆవిధంగా ఇప్పు డు కాశీపట్నం వంకాయ సాగు విస్తృతమైంది.
విత్తన బ్యాంక్లు
ఇప్పటి దాకా పేర్కొన్న ఊళ్లలోని రైతులు విత్తనాలను అమ్మి లాభాలు గడిస్తే మెదక్ జిల్లా పస్తాపూర్ వాసులు మాత్రం విత్తనాల్ని 'బ్యాంక్'లలో దాచుకుంటున్నారు. అందుకే రకరకాల నాటు రకం మెట్టధాన్యాల్ని ఎలా పండించాలో, ఆ విత్తనాల్ని భద్రపరచడం ఎలాగో తెలియాలంటే జహీరాబాద్ సమీపంలోని పస్తాపూర్, దాని చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లాల్సిందే.
డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చాలా కాలంగా మహిళా రైతులు జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు లాంటి మెట్ట ధాన్యాల్ని సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నారు. అక్కడితో ఆగిపోకుండా వాళ్లు ఏటా పండించిన విత్తనాల్లో కొంత భాగాన్ని వేరు చేసి వాటిని చిన్న చిన్న మట్టి పాత్రల్లో పోసి, వాటికి పురుగు పట్టకుండా, వేపాకులు కలిపి భద్రపరుస్తారు. ఈ విధంగా సుమారు అరవై రకాల విత్తనాలతో సీడ్బ్యాంక్ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి గ్రామంలోనూ ఒక విత్తన బ్యాంక్ ఉంటుందక్కడ. ఆ విత్తన బ్యాంకులు అందరి ఆస్తి. వాటిని మహిళా సంఘాలే నిర్వహిస్తాయి. రైతులంతా వారివారికి కావాల్సిన విత్తనాల్ని ఆ బ్యాంక్ నుంచే ఏటా తీసుకెళతారు. పండిన పంటల నుంచి కొంత మొత్తాన్ని మళ్లీ బ్యాంక్కి ఇస్తారు. అలా మూడేళ్లు గడిచే నాటికి ఆ గ్రామాల్లో రైతులు రెండున్నర వేల ఎకరాలకు కావాల్సిన విత్తనాలను సేకరించగలిగారని డెక్కన్డెవలప్మెంట్ సొసైటీ అంటుంది. అందుకే వాళ్లిప్పుడు విత్తనాల కోసం వేల రూపాయలు వెచ్చించనవసరం లేదు. విత్తన సంస్థలను ఆశ్రయించాల్సిన అవసరం లేదు.
***
రాష్ట్రంలో వ్యవసాయానికి కావాల్సిన విత్తనాలన్నీ పండించేది రైతులే. అయితే వాటిని కొని మళ్లీ రైతులకు అమ్మే విత్తన సంస్థలు మాత్రం రైతులకు చెల్లించే దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ మొత్తానికి అమ్ముకుంటూ కోట్ల లాభా ల్ని ఆర్జిస్తున్నాయి. విత్తనాలు నేరుగా అమ్ముకునే గ్రామాల్లో మాత్రం ఆ లాభమంతా పండించే రైతుకే దక్కడం విశేషం. ఇలాంటి గ్రామాలు మన రాష్ట్రం లో ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని గ్రామాలు కొన్ని విత్తనాలకు పేరు పడి ఒకనాటి స్వయంపోషక గ్రామీణ వ్యవస్థకు ప్రతీకగా నిలుస్తున్నాయి. మొదట్లో వ్యవసాయం రైతుల చేతుల్లోనే ఉన్నా రానురాను విత్తనాల కంపెనీలు, ఎరువులు, పురుగు మందుల కంపెనీల రాకతో అది కాస్తా వ్యాపార సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయింది. కొన్ని ఊళ్ళలో మాత్రమే ఇంకా రైతుల చేతుల్లో ఉందనడానికి ఈ గ్రామాలే ఉదాహరణ. ఇప్పుడు సేంద్రీయ సాగుపై ఆసక్తి పెరగడం వల్ల వ్యవసాయం మళ్లీ పూర్తిగా రైతుల చేతుల్లోకెళ్లే రోజు వస్తుందని, సాగుకి తగిన ఫలం రైతులకు అందుతుందని ఆశిద్దాం.
- ఆన్లైన్ న్యూస్నెట్వర్క్ సహకారంతో